సూపర్ సార్ట్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి ఆరోగ్య సమస్యలతో మరణించారు. లివర్ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. దీంతో కృష్ణ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

 

రమేష్ బాబుతో మహేష్ బాబుకి మంచి బాండింగ్ ఉండేది. అన్నయ్యగా కంటే తండ్రిగా మహేష్ బాబుని చూసుకునేవారు రమేష్ బాబు. కృష్ణ సినిమాలతో బిజీగా ఉండడంతో.. మహేష్ బాధ్యతలను రమేష్ చూసుకునేవారు. దీంతో అన్నయ్య అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. తనకు ఏం కావాలన్నా.. ముందు అన్నయ్య దగ్గరకే వెళ్లేవారు మహేష్. అలాంటి వ్యక్తిని కోల్పోవడం మహేష్ కి ఎప్పటికీ తీరని లోటు. 

 

సొంత అన్నయ్య చనిపోయినా.. చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మహేష్ బాబు. ఆయనకు కరోనా రావడంతో ఐసొలేషన్ లో ఉన్నారు. దీంతో అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా తన అన్నయ్యకు నివాళులు అర్పించారు. 

 

'నువ్వే నాకు స్ఫూర్తి.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నాకంతా నువ్వే.. నువ్ లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. నువ్ నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీస్కో.. ఈ జీవితంలోనే కాదు.. నాకు మరో జీవితం ఉంటే అప్పటికీ నువ్వే నా అన్నయ్య.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. దీన్ని బట్టి మహేష్ కి తన అన్నయ్య అంటే ఎంత ప్రేమో తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్య‌క్రియ‌లను పూర్తి చేశారు.