Breaking News Live: మరోసారి ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Mar 2022 03:39 PM
మరోసారి ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ 

తెలంగాణ ఆర్టీసీ మరోసారి ఛార్జీలు పెంచింది. ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సులలో రూ. 5 పెంచింది. గరుడ, లగ్జరీ బస్సుల్లో రూ.10 ఛార్జీలు పెంచింది. పాసింజర్ సెస్ పేరిట ఛార్జీలు పెంచినట్లు తెలుస్తోంది. ఆర్డినరీ బస్సుల్లో రూ.1 సెస్ వసూలు చేస్తున్నారు.  

Yadadri Temple: సతీసమేతంగా యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి గంగుల

Minister Gangula Kamalakar Yadadri Temple: బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. సతీసమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు సమర్పించుకున్నారు. యాదాద్రి ఆలయంలో మహా సంప్రోక్షణ ఘనంగా జరిగింది.

Yadadri Maha Samprokshana: గర్భాలయంలోకి ఉత్సవ మూర్తులు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కొద్దిసేపటి క్రితమే మహాకుంభ సంప్రోక్షణ ఘట్టం పూర్తయింది. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను యాదాద్రి గర్భాలయంలోకి తీసుకువెళ్లారు. స్వయంభువు లక్ష్మీనరసింహ స్వామికి మొదటి పూజ, మహానివేదన, మొదటి తీర్థ ప్రసాదగోష్ఠిని వేద పండితులు సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మహా వేద ఆశీర్వచనం ఇచ్చారు.

బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ, బీజేపీ సభ్యుల కోట్లాట.. అయిదుగురు సస్పెండ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో వివాదం జరిగింది. టీఎంసీ, బీజేపీ సభ్యులు వాగ్వివాదానికి దిగగా, ఆపై తోపులాట జరిగి భౌతికదాడులకు దారితీసింది. ఐదుగురు బీజేపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.

Guntur SP Office: గుంటూరు జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నం

Woman Suicide Attempt At Guntur SP spandana program: గుంటూరు ఎస్పీ కార్యాలయం దగ్గర కలకలం రేగింది. గ్రీవెన్స్‌కు పురుగుల మందు డబ్బాతో వచ్చిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ స్పందన కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని జీజీహెచ్‌కు తరలించారు. అయితే పురుగులమందు వాసనకు ఓ కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.

నెల్లూరులో సీఎం జగన్ పర్యటన.. మరోవైపు కార్మికుల ఆందోళన

ఓవైపు సీఎం జగన్ పర్యటన.. మరోవైపు కార్మికుల ఆందోళన


ఓవైపు నెల్లూరు నగరంలో సీఎం జగన్ పర్యటన ఉండగా.. మరోవైపు అదే రోజు కార్మిక సంఘాల ఆందోళనతో నెల్లూరు దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె నెల్లూరులో జరిగింది. గాంధీ బొమ్మ వద్ద నిరసన భేరి మోగించిన కార్మికులు... నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నగరం ఎర్రజెండాల మయం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సమయంలో కార్మిక సంఘాల నేతలు రోడ్డెక్కడంతో పోలీసులు మరింత పగడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. సీఎం టూర్ రూట్ మ్యాప్ లోకి కార్మికులను రానీయకుండా నిలువరించగలిగారు పోలీసులు. 

FIR against Temple Chairman: కబేళాకు ఆవుల విక్రయం - ఆలయ ఛైర్మన్‌పై కేసు నమోదు

FIR against Temple Chairman: హైదరాబాద్‌: గోవధకు ఆవులను విక్రయిస్తున్నారంటూ కొమట్‌వాడిలోని ఆలయ ఛైర్మన్‌పై కేసు నమోదైంది. నగరంలోని కబేళాకు ఆవును విక్రయించినందుకు ఆలయ ఛైర్మన్‌పై డబీర్‌పురా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కోమట్‌వాడిలోని పోచమ్మ ఆలయం ఛైర్మన్ డి.ప్రేమ్ కుమార్ నగరంలోని కబేళాకు ఆవుల్ని విక్రయిస్తున్నారని అఖిల భారత గౌ సేవా ఫౌండేషన్ ప్రతినిధి ఎ. బాల కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కమిటీ సభ్యుడు ఎడ్ల మహేందర్‌ పై సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Yadadri Temple: ఎంపీ కోమటిరెడ్డి అసంతృప్తి

యాదాద్రి ఆలయ పున:ప్రారంభ కార్యక్రమంపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు ఏంటని అన్నారు. సీఎంవో ప్రోటోకాల్‌ పాటించలేదని విమర్శించారు. యాదాద్రి మహాసంప్రోక్షణకు అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారని, స్థానిక ఎంపీ అయిన తనను మాత్రం పిలవలేదని అన్నారు. దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేశారు.





Goa CM Pramod Sawant: గోవా సీఎంగా వరుసా రెండోసారి ప్రమోద్ సావంత్ ప్రమాణం

Goa CM Pramod Sawant: గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ప్రమోద్ సావంత్‌తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ , హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, తదితర ప్రముఖులు హాజరయ్యారు. 2019లో మొదటిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ నేడు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 

KCR In yadadri: స్వర్ణ కలశాలకు సంప్రోక్షణలో కేసీఆర్

యాదాద్రిలో ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ కార్యక్రమాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, స‌తీసమేతంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో భాగంగా బంగారు క‌వ‌చమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు ప్రద‌ర్శించ‌డంతో పాటు క‌ళా ప్రద‌ర్శన‌లు చేప‌ట్టారు. వేద మంత్రోచ్ఛార‌ణలు, మేళ‌తాళాల మ‌ధ్య శోభాయాత్ర వైభ‌వంగా కొన‌సాగుతోంది. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆల‌యం చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపుర‌రం వద్ద సీఎం కేసీఆర్ స్వయంగా పల్లకీ మోశారు. నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేశారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు.

Srisailam: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ దంపతులు

శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న స్పీకర్ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలను అనుసరించి అర్చకులు, వేదపండితులు జిల్లా ఆలయ ఈవో లవన్న స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ దంపతులు స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు,వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో లవన్న స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

KCR in Yadadri: 12.10 కి ఆలయ ప్రవేశం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో యాదాద్రి చేరుకున్నారు. 11.55 గంటలకు మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ ప్రారంభం కానుంది. కేసీఆర్ కుటుంబ స‌మేతంగా స్వయం‌భు‌వుల తొలి పూజలో పాల్గొంటారు. మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు ఆల‌య ప్ర‌వేశం జ‌ర‌గ‌నుంది. స్వ‌ర్ణ ధ్వ‌జ‌స్తంభ సంద‌ర్శ‌న ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 3 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు సీఎం తిరిగి ప‌య‌న‌మ‌వుతారు. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు ప‌టిష్ఠ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Yadadri: ఐదేళ్లలో పూర్తి కావడం స్వామి అనుగ్రహమే: ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి

నేడు యాదాద్రి ఆలయ పున:ప్రారంభం సందర్భంగా ఆర్కిటెక్ట్ ఆనంద సాయి స్పందించారు. యాదాద్రి పునర్నిర్మాణ ప్రాజెక్టులో భాగం కావడం పూర్వజన్మ సుక్రుతం అని అన్నారు. 40 ఏళ్ళు పట్టే ఈ ప్రాజెక్టు నరసింహస్వామి అనుగ్రహంతో ఐదేళ్లలో పూర్తయ్యిందని తెలిపారు. యాదాద్రి కోసం చాలా క్షేత్రాలు తిరిగానని, దాదాపు 2వేల డ్రాయింగ్స్ గీసినట్లు చెప్పారు. శ్రీరంగం టెంపుల్ చాలా బాగా నచ్చిందని, ఆ టెంపుల్‌లోని గోపురంలా కృష్ణ రాతి శిలలతో, గురజాడ పల్లి నుంచి ఒక కొండనే ఉపయోగించామని చెప్పారు. రెండున్నర లక్షల టన్నుల ఏకరీతి కృష్ణ రాతి శిల దొరకడం స్వామి అనుగ్రహమే అని వివరించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా యాదాద్రిలో ప్రాకారాలు, గోపురాలు కృష్ణ రాతి శిలతోనే నిర్మించినట్లు చెప్పారు. యాదాద్రిలో పసిడి వర్ణ కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు.

యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రికి కేసీఆర్

యాదాద్రి మహా కుంభసంప్రోక్షణంలో పాల్గనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సకుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఉదయం 11.55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ ప్రారంభం కానుంది.

Background

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి కొద్ది గంటలే మిగిలి ఉంది. సోమవారం (మార్చి 28) ఉదయం 11.55 గంటలకు మంచి ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. ఈ మహా క్రతువుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేపడతారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేస్తారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తారు. 


ఈ క్రతువులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధనలు జరుపుతారు. అనంతరం స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. బాలాలయంలో 2016 ఏప్రిల్‌ 21 నుంచి ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలకు తెరపడింది.


యాదాద్రి ఆలయంలో నేటి కార్యక్రమాలు ఇవీ..
* ఉదయం 7.30 గంటల నుంచి నిత్య హోమాలు, చతుస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి కార్యక్రమాలు ఉంటాయి.
* ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిథున లగ్న పుష్కరాంశమున గర్తవ్యాసము, రత్నవ్యాసము, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్టబంధనం, కళారోహణం, ప్రాణ ప్రతిష్ఠ, నేతోన్మీలనం, దిష్టికుంభం ఉంటుంది.
* ఉదయం 10 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది.
* మధ్యాహ్నం 11.55 గంటలకు మిథునలగ్న సుముహూర్తాన మహా కుంభాభిషేకం, ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు
* సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్‌ సన్మానం, మహాదాశీర్వచనం ఉంటుంది.


ఆదివారం పంచశయ్యాధివాసం
పాంచరాత్ర ఆగమ విధానాలతో ఆదివారం నాడు మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం జరిగాయి. శాస్ర్తోక్తంగా 108 కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం చేశారు. కలశాల్లో పవిత్ర జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలను నింపి సుదర్శన చక్రం, పెరుమాళ్లు, గోదాదేవి, గరుడ, విష్వక్సేన, ప్రతిష్ఠామూర్తులను అభిషేకించారు. ప్రధానాలయంలో షోడశకళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం పర్వాలను నిర్వహించినట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘల్‌ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. బాలాలయంలో వేద మంత్రాలు, సామూహిక విష్ణు సహస్రనామ పఠనం తదితర కార్యక్రమాలు కొనసాగాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.