Srivari Abhishekam at Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో వెలసిన కోనేటిరాయుడు భక్తజనప్రియుడు, నైవేద్య ప్రియుడు, అలంకారప్రియుడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగే స్వామివారి సన్నిధిలో నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం ఇలా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. సుప్రభాత సేవ మొదలు ఏకాంత సేవ వరకు ఎన్నో రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. 


సుప్రభాతసేవతో శ్రీవారిని మేల్కొలిపి తోమాలసేవతో పుష్పాలంకరణ చేసి..అర్చనతో సహస్ర నామార్చన నిర్వహిస్తారు. ఆ తర్వాత వారోత్సవం, కళ్యాణోత్సవం, డోలోత్సవం,  వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు  నిర్వహిస్తారు. సాయంత్రం తోమాల సేవ, అర్చన సేవలు నిర్వహించి రాత్రికి ఏకాంతసేవతో నిద్రపుచ్చుతారు. ఇది నిత్య కృత్యం...


మాసోత్సవాలు


స్వామివారికి నెలకో ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తుంటారు
జనవరి - పార్వేటి ఉత్సవం
ఫిబ్రవరి - రథసప్తమి
మార్చి -  తెప్పోత్సవం
ఏప్రిల్ - వసంతోత్సవం
మే - పద్మావతి పరిణయోత్సవం
జూన్‌ - జేష్ఠాభిషేకం
జూలై - ఆణివార ఆస్థానం
ఆగస్టు - పవిత్రోత్సవాలు
అక్టోబరు-  బ్రహ్మోత్సవాలు
నవంబరు - పుష్పాభిషేకం 
డిసెంబరు-  తిరుప్పావై  


Also Read: ముస్లిం భక్తుడు సమర్పించిన బంగారు పూలతోనే దశాబ్ధాలుగా శ్రీవారికి అష్టదళ పద్మారాధన సేవ!


వారోత్సవాలు


సోమవారం - విశేషపూజ
మంగళవారం - అష్టదళపాదపద్మారాధన
బుధవారం - సహస్రకలశాభిషేకం
గురువారం - తిరుప్పావై
శుక్రవారం - మూలవిరాట్టుకు అభిషేకం 


శుక్రవారం రోజు స్వామివారికి నిర్వహించే అభిషేకంలో వినియోగించే ద్రవ్యాలు



  • 84 తులాల పచ్చకర్పూరం

  • 36తులాల కుంకుమ పువ్వు

  • తులం కస్తూరి

  • ఒకటిన్నర తులం పునుగు తైలం

  • 24 తులాల పసుపుపొడి 


ఈ పరిమళ ద్రవ్యాలతో తిరుమలేశుడికి అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని  పులికాపు తీర్ధం అని పిలుస్తారు. అభిషేక సేవలో పాల్గొనే భక్తులపై ఈ తీర్థాన్ని చల్లుతారు. 


Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!


అభిషేక సేవ తర్వాత శ్రీనివాసుడి నొసట నామాలు దిద్దుతారు.. దీనినే తిరుమణికాప్పు అంటారు. వారంలో అభిషేకసేవ జరిగిన తర్వాత మాత్రమే తిరుమణికాప్పుకోసం 16 తులాల పచ్చకర్పూరం, ఒక్కటిన్నర తులం కస్తూరిని  ఉపయోగిస్తారు. 


గురువారం నాటికి నామం తగ్గడంతో ఆ రోజు శ్రీవారి నేత్రాలు బాగా కనిపిస్తాయి..అందుకే గురువారం దర్శనానికి వెళ్లేభక్తులకు శ్రీవారి నేత్రదర్శనభాగ్యం లభిస్తుంది.


బ్రహ్మోత్సవాల సమయంలో ఈ నామం సమర్పణ రెట్టింపు ఉంటుంది. అంటే.. బ్రహ్మోత్సవాలు ప్రారంభమవడానికి ముందువచ్చే శుక్రవారం  32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరితో  నామాలు పెడతారు. 


అభిషేక సేవ తిరుమణికాప్పు తర్వాత 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు ఉన్న పెద్ద పట్టువస్త్రాన్ని ధోవతిగా...  12 మూరల పొడవు 2 మూరల వెడల్పు ఉన్న పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా అలంకరిస్తారు. 


వస్త్రాలంకరణ పూర్తైన తర్వాత 38 రకాల ఆభరణాలతో మూల విరాట్టును అలంకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆగమబద్ధంగా నిర్వహించేందుకు దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుంది. 


Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!


సాధారణంగా శ్రీవారికి ప్రీతికరమైన శనివారం రోజు ఈ సేవ నిర్వహించాలి కదా అనే వారున్నారు...కానీ శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. ఇలాంటి మసయంలో రెండున్నరగంటలపాటూ అభిషేక నిర్వహిస్తే భక్తులు ఇబ్బందిపడాల్సి ఉంటుంది. 


శ్రీనివాసుడి వక్షస్థలంపై లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అమ్మవారికి శుక్రవారం ప్రీతికరం.. అందుకే శుక్రవారం అభిషేకసేవ నిర్వహిస్తారు.