Ashtadala Pada Padmaradhana Seva: పేరు సయ్యద్ మీరా..గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ముస్లిం అయినప్పటికీ శ్రీ వేంకటేశ్వరుడు అంతే అమితమైన భక్తి. శ్రీవారు కొందరివాడు కాదు అందరివాడు అనే నమ్మే వ్యక్తి. అందుకే సయ్యద్ మీరా ఇంటిల్లిపాది స్వామివారి భక్తులుగా మారిపోయారు. తరచూ తిరుమల వెళ్లొస్తూ ఉండేవారు. ఎన్నో కానుకలు సమర్పించారు. అందుకే ఎవ్వరీకీ దక్కని భాగ్యం ముస్లి భక్తుడికి దక్కింది. ఇప్పటికీ సయ్యద్ మీరా సమర్పించిన బంగారు పుష్పాలతోనే స్వామివారికి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.


సాధారణంగా ఏడుకొండలవాడి భక్తుల్లో హిందువులు మాత్రమే కాదు..అన్ని మతాల వారూ ఉన్నారు. అయితే దర్శనానికి వెళ్లిరావడం వేరు.. స్వామివారి ఆర్జితసేవల్లో భాగంగా ఎప్పటికీ నిలిచిపోవడం వేరు..అదే సయ్యద్ మీరా ప్రత్యేకత..తన భక్తికి దక్కిన ప్రతిఫలం...


Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!


1978 సంవత్సరం నుంచి సయ్యద్ మీరా తన కుటుంబ సభ్యులతో కలసి నిత్యం తిరుమలేశుడుని దర్శించుకునేవారు. ఓసారి దర్శనం తర్వాత అర్చకులను కలసి తనకు వస్తున్న కలల గురించి చెప్పాడు. అప్పుడు అర్చకుల సూచనల మేరకు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నాడు సయ్యద్. అంతే అప్పటి నుంచి కలలో పాములు రావడం ఆగిపోయింది. అప్పటి నుంచి స్వామివారికి పరమభక్తులుగా మారిపోయారు మీరా కుటుంబ సభ్యులు. ఏటా స్వామివారిని దర్శించుకుని తరించేవారు..


 1983 టీటీడీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు..ఆ సమయంలో ఉత్సవాలకు గుర్తింపుగా స్వామివారికి ఏదైనా నూతన కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రారంభించినదే ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అష్టదళపద్మారాధన సేవ. 


వారోత్సవాల్లో భాగంగా ప్రతి మంగళవారం నిర్వహించే ఈసేవకోసం స్వామివారికి 108 బంగారు పుష్పాలు కావాలనుకున్నారు..కానీ అప్పటికి టీటీడీ ఆదాయం అంతగా లేదు. అందుకే దాతల కోసం ఎదురుచూశారు... అదే సమయంలో తిరుమల దర్శనానికి వచ్చిన సయ్యద్ మీరాతో అర్చకులు ఈ విషయం చెప్పారు. అంతకన్నా మహాభాగ్యం ఏముంటుందన్న సయ్యద్...నమో నారాయణాయ అని ముద్రించి ఉన్న 23 గ్రాములతో 108 బంగారు కమలాలాను సమర్పించారు.


Also Read: తిరుమలలో మహాశాంతి హోమం..హోమాలతో దోషాలుపోతాయా - యజ్ఞం, యాగం, హోమం మధ్య వ్యత్యాసం ఏంటి !


1985 నుంచి ఇప్పటి వరకూ శ్రీవారి ఆర్జితసేవల్లో ఒకటైన అష్టదళపద్మారాధన సేవకు ఈ ముస్లింభక్తుడు ఇచ్చిన బంగారు పుష్పాలనే వినియోగిస్తున్నారు. 


అల్లా-జీసెస్-వేంకటేశ్వరస్వామి..ఎవరైనా ఒక్కటే..భగవంతుడు అంటే మన ప్రతి అడుగులో ముందుండి నడిపించేశక్తి అంటారు సయ్యద్ మీరా. 


శ్రీవారి భక్తుడిగా మారిన సయ్యద్ మీరాకు మతపరంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి..కానీ..ఆయన భక్తిలో ఎలాంటి మార్పూ రాలేదు. చివరి శ్వాసవరకూ శ్రీ వేంకటేశ్వరస్వామి స్మరణలోనే గడిపారు...


స్వామివారికి నిత్యం మూడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు...వీటిని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అని పిలుస్తారు. 
మొదటి గంట ఉదయం 5.30 కి తొలినివేదన....రెండో గంటలో భాగంగా ఉదయం 10 కి రెండోసారి నివేదన.. మూడో గంటలో భాగంగా రాత్రి ఏడున్నరకు మూడోసారి నివేదన ఉంటుంది. 


Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!


ప్రతి మంగళవారం రెండో గంట నివేదన తర్వాత అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహిస్తారు. మొదట్లో వారోత్సవాల్లో భాగంగా ప్రారంభమైన సేవ ఇప్పుడు ఆర్జితసేవగా మారింది. ఈ సేవలో పాల్గొనే భక్తులు..బంగారు వాకిలి,కులశేఖరప్పడి మధ్య మండపంలో కూర్చునేందుకు అనుమతిస్తారు.  
  
అష్టదళ పాద పద్మారాధన సేవ కోసం  టిక్కెట్టును తిరుమల తిరుపతి దేవస్థానం నెలల వారిగా విడుదల చేస్తారు. ఓ వ్యక్తి రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!