ఉపాధి హామీ బిల్లుల బకాయిల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. గత విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్రంగా విరుచుకు పడింది. రెండు వారాల క్రితం 494 కేసులలో చెల్లింపులు చేయమని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 25 కేసులలోనే చెల్లింపులు చేసి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే తాము సర్పంచ్ అకౌంట్‌లోకి జమ చేస్తున్నామని కానీ వారు కాంట్రాక్టర్‌కు చెల్లించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 15వ తేదీ లోపు  చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అకౌంట్‌లో జమ చేసినప్పటికీ చెల్లించని సర్పంచ్‌ల వివరాలు కూడా చెప్పాలని వారిపై కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు ఆదేశించింది. 


Also Read : విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర పెత్తనం ఎవరిచ్చారు ?


ఇంకా పలు పనులకు సంబంధించి విచారణ జరుగుతున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రెండున్నరేళ్ల తర్వాత కూడా విచారణేమిటని ధర్మానసం ప్రశ్నించింది.  ఉపాధి హామీ నిధులు చెల్లించడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఏడాదిన్నర నుంచి ఏపీ హైకోర్టు పలుమార్లు చెల్లింపులు చేయాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తోంది. ఓ సారి కేంద్రం ఇవ్వలేదని మరో సారి విజిలెన్స్ విచారణ చేయిస్తున్నామని చెబుతోంది. హైకోర్టు ఆగ్రహంతో పంచాయతీల అకౌంట్లలో జమ చేసి ఇచ్చినట్లుగా చూపించాలని అనుకున్నారు. కానీ కాంట్రాక్టర్లు తమకు చెల్లించలేదని చెప్పడంతో అదీ వివాదాస్పదమయింది. 


Also Read : ఏపీలో అదనపు రుణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్


హైకోర్టు విచారణ జరిగిన ప్రతీ సారి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది.  పంచాయతీరాజ్ శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, రావత్ వరుసగా కోర్టుకు హాజరవుతున్నారు. వీరు హాజరయినప్పుడల్లా  ఇప్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని హైకోర్టుకు చెబుతూ ఉంటారు. కానీ తర్వాతి విచారణలో చెల్లించలేదని హైకోర్టులో వాదనలు వినిపించడం రివాజుగా మారింది. వీరు తీరును చూసిన హైకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
    Also Read : సీబీఐకి పంజరం నుంచి విముక్తి ఎప్పుడు ?
2018-19 సంవత్సరానికి గాను అధికారిక లెక్కల ప్రకారం  7 లక్షల పైచిలుకు పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చేసిన పనులకు అధికారులు కొలతలు తీసి.. బిల్లులు కూడా సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో చెల్లింపులు నిలిపివేసింది. విజిలెన్స్‌ ఎంక్వైరీ పేరుతో బిల్లులు నిలిపివేశారు. అనేక మంది కోర్టులకు వెళ్లడంతో వారికి డబ్బులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.   కేంద్ర ప్రభుత్వం తామివ్వాల్సిన నిధులన్నీ ఇచ్చేశామని హైకోర్టుకు తెలిపింది.  అయినా ప్రభుత్వలో మాత్రం చలనం రావడం లేదు. హైకోర్టు ఆదేశాలను ఎప్పటికప్పుడు పట్టించుకోకుడా వాయిదాల మీద వాయిదాలు కేసును నడిపిస్తూనే ఉంది. 


Also Read : ఎన్టీఆర్ - కొరటాల మూవీ అప్ డేట్