ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకునేందుకు అనుమతి లభించింది. మరో రూ.10,500 కోట్ల రుణానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అనుమతి ఇచ్చింది. దీనిపై రిజర్వు బ్యాంకుకు సమాచారం పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ తాజా నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలానికి ఇచ్చిన రుణ పరిమితి మేరకు ఇప్పటికే ఏపీ రుణాలు తీసుకుంది. ఈ అనుమతికి అనుగుణంగా రూ.1,000 కోట్లు గత మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రుణంగా స్వీకరించింది. కేంద్రం విధించిన పరిమితికి పూర్తవ్వడంతో మున్ముందు రాష్ట్ర ఆర్థిక అవసరాలకు రుణాలు ఎలా అనే ప్రశ్నతలెత్తింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కొత్తగా రుణం దొరికే మార్గం కనిపించింది.


ఫలించిన పర్యటనలు


ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఆర్థిక శాఖ అధికారులు రుణ పరిమితి పెంపు కోసం చేసిన దిల్లీ పర్యటనలు ఫలించాయి. అంతకుముందు సంవత్సరాల్లో అదనంగా తీసుకున్న రుణాల కోత నుంచి ఈ ఏడాదిని మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మరో రూ.10,500 కోట్ల రుణానికి అనుమతినిచ్చింది. డిసెంబరు వరకు ఉన్న రుణ పరిమితిని పెంచినట్లయింది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ మొత్తాన్ని రాష్ట్రం అప్పుగా తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో తొలి తొమ్మిది నెలల కాలానికి రాష్ట్ర రుణ పరిమితి రూ.31,251 కోట్లకు పెరిగింది. 


Also Read: టీఆర్ఎస్ ఢిల్లీ రాజకీయాలతో గల్లీ బీజేపీలో గందరగోళం ! కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అయిందా !?


రుణ పరిమితికి మించి


ఏపీకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.42,472 కోట్ల రుణం తీసుకునే అర్హత ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నాలుగు శాతం మేర మాత్రమే రుణం పొందవచ్చు. దీంట్లో కేంద్రం అనేక షరతులు విధించింది. మూలధన వ్యయం నిర్దిష్ట పరిమితి మేరకు ఖర్చు చేస్తేనే 0.5 శాతం రుణం లభిస్తుందని పేర్కొంది. ఆ మేరకు రూ.5,309 కోట్లు కోత పెట్టింది. మిగిలిన రూ.37,163 కోట్లకు ఇప్పటికే రాష్ట్రం పొందిన రుణాలు తిరిగి చెల్లించినందున రూ.14,429 కోట్లు అదనంగా చేర్చింది. దీంతో మొత్తం రుణ అర్హత రూ.51,592 కోట్లకు పెరిగింది.  ఏపీ గతంలోనే ఈ రుణ పరిమితిని దాటేసింది. ఆ మొత్తం విలువ రూ.17,923 కోట్లుగా ఉంది. ఇది మినహాయించి, కొత్తగా రుణ అర్హత రూ.33,668 కోట్లుగా తేల్చారు. ఇందులో నుంచి ఇతర రుణాల మొత్తం రూ.6,000.21 కోట్లు కోతపెట్టారు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీ రుణ పరిమితిని రూ.27,668.68 కోట్లకు పరిమితం చేశారు. 


రుణపరిమితిపై లేఖలు


రుణ పరిమితిపై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏప్రిల్‌, జులైలో  కేంద్రానికి  రెండు లేఖలు రాశారు. గత ప్రభుత్వం పరిమితికి మించి చేసిన రుణాన్ని ఈ ఏడాదిలో కోత పెట్టవద్దని కోరారు. వివిధ సమీకరణాలు, వాదనల తర్వాత కేంద్రం తాజాగా రాష్ట్ర రుణ పరిమితిని పెంచింది. దీంతో తొలి తొమ్మిది నెలలకు రాష్ట్ర రుణ పరిమితి రూ.31,251 కోట్లకు పెరిగింది. రుణ ప్రతిపాదనలను రాష్ట్రం రిజర్వు బ్యాంకుకు సమర్పించింది. మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో రూ.2,000 కోట్ల రుణం సమీకరించనుంది. 18 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 20 ఏళ్ల గడువుతో మరో రూ.1000 కోట్లు రుణం తీసుకోనుంది. 


 


Also Read: AP Loans : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!