'వరుడు కావలెను' విడుదలకు ఒక్క రోజు ముందు హీరో నాగశౌర్య చిన్న అప్‌డేట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ కలిగించాడు. సినిమాలో త్రివిక్రమ్ ఓ సీన్ రాశారని చెప్పాడు. ఆ సన్నివేశంలో నటించడం, త్రివిక్రమ్ రాసిన డైలాగులు చెప్పడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. దాంతో ఆ సన్నివేశం ఎలా ఉంటుందోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'వరుడు కావలెను' నిర్మాతలకు దర్శకుడు త్రివిక్రమ్ ఎంత క్లోజ్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'జులాయి' నుండి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లో సినిమాలు తీస్తున్నారు. దాని అనుబంధ సంస్థ  సితార ఎంటర్టైన్మెంట్స్ 'వరుడు కావలెను' నిర్మించింది. నిర్మాతల కోసం త్రివిక్రమ్ ఆ సీన్ రాసి ఉండొచ్చు.




ఇక, 'వరుడు కావలెను' గురించి నాగశౌర్య మాట్లాడుతూ "పరిణితి చెందిన ప్రేమకథ ఇది. ఇందులో రెండు ప్రేమకథలు ఉన్నాయి. పెళ్లి పీటల ముందువరకూ జరిగే కథ ఇది. ఆడవాళ్లు ఒప్పుకొనేంత వరకూ వెయిట్ చేయాలని చెప్పే ప్రేమకథ ఇది.  సాధారణంగా 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా?లేరా? అనేది చూడకుండా పెళ్లి ఎప్పుడని అడుగుతారు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు. వ్యక్తిగతంగా నాకు 70, 80 శాతం కనెక్ట్ అయ్యింది. 'అత్తారింటికి దారేది'లో నదియాగారి పాత్ర చూసి... ఆమెతో మా సినిమాలో పాత్ర చేయించడం కరెక్టేనా? అనిపించింది. కానీ, ఆమె అద్భుతంగా నటించారు" అని చెప్పారు. సినిమా చూశాక... బ్లాక్ బస్టర్ అనిపించిందని నాగశౌర్య చెప్పాడు. తాను సినిమాల్లో మాత్రమే నటించగలనని, బయట నటించలేనని, ఒకవేళ సినిమా ప్లాప్ అయితే తన ముఖంలో తెలుస్తుందని ఆయన వివరించారు. 



 

గతంలో నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య నటించారు. 'కళ్యాణ వైభోగమే' సినిమా చేశారు. 'ఓ బేబీ'లో అతిథి పాత్ర చేశారు. 'వరుడు కావలెను'కు దర్శకత్వం వహించినది కూడా మహిళే. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఫిమేల్ డైరెక్టర్స్ కి ఓపిక ఎక్కువ అని, వాళ్లకు త్వరగా కోపం రాదని నాగశౌర్య చెప్పుకొచ్చాడు.