కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని విశ్లేషించారు.  దశ దిశా నిర్దేశం లేని., పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ గా కేసీఆర్ తేల్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటల గారడీ చేశారని విమర్శించారు.


Also Read: ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులేదు! ప్చ్.. వేతన జీవులకు నిరాశే!!


కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తోందని .. ప్రయోజనం లేని అంశాలపై  మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారన్నారు.  వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న  చర్యలు శూన్యమని సిఎం కేసీఆర్ అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని సిఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్  సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.


Also Read: రాష్ట్రాలకు "నిర్మల"మైన కానుక.. వడ్డీ లేని రూ. లక్ష కోట్ల రుణాలు !


ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని.. ఇన్ కం టాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సిఎం అన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని , వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం తదితర ప్రజారోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు. 


Also Read: 'అమృత కాలం'కు 'పీఎం గతి శక్తి'తో బాటలు..! రాబోయే 25 ఏళ్లకు నిర్మలమ్మ మాస్టర్‌ ప్లాన్‌!


ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే..ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని కేసీఆర్ విమర్శించారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు.  దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని కేసీఆర్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. మొత్తంగా బడ్జెట్ దేశ ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగకరం కాదన్నారు.