భారత్‌ మరో ముందడుగు వేసింది! ఇకపై ఎలక్ట్రానిక్‌ చిప్స్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులను విడుదల చేయనుంది. 2022-23 ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిసింది. ఈ కొత్త పాస్‌పోర్టులతో మరింత రక్షణ లభిస్తుంది. ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం, వేలి ముద్రలు, ప్రయాణిస్తున్న వివరాలు నిక్షిప్తం చేస్తారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీటి గురించి వివరించారు.


గతంలోనే ప్రకటన


వాస్తవంగా చిప్‌తో కూడిన ఈ-పాస్‌ పోర్టులను జారీ చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించుకుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID), బయోమెట్రిక్‌ను ఇందులో ఉపయోగిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్‌ భట్టాచార్య ఈ విషయాన్ని గత నెల్లోనే తెలియజేశారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా ఇది ఉంటుందన్నారు. ఈ పాస్‌పోర్టు జాకెట్‌లోని ఎలక్ట్రానిక్‌ చిప్‌లో భద్రత సంబంధ వివరాలు ఎన్‌కోడ్‌ చేసి ఉంటాయి.


Also Read: Budget 2022: గుడ్ న్యూస్.. 80 లక్షల ఇళ్ల నిర్మాణం.. రూ.44 వేల కోట్లు కేటాయింపు


Also Read: Union Budget 2022 : రాష్ట్రాలకు "నిర్మల"మైన కానుక.. వడ్డీ లేని రూ. లక్ష కోట్ల రుణాలు !


జైశంకర్‌ కృషి


ప్రస్తుతం పాస్‌పోర్టులను ముద్రించి ఇస్తున్నారు. చిప్‌ ఆధారిత ఈ-పాస్‌ పోర్టులను జారీ చేయడంపై ఇంతకు ముందే విదేశాంగ మంత్రి జైశంకర్‌ చర్చలు జరిపారు. 'ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌'తో మాట్లాడారు. త్వరలోనే కల నిజం అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.


ఈ-పాస్‌పోర్టు ఫీచర్లు ఇవే


* అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ-పాస్‌ పోర్టు ఉంటుంది.
* దరఖాస్తు దారుల సమాచారం, డిజిటల్‌ సంతకం చిప్‌లో భద్రపరుస్తారు.
* ఎవరైనా చిప్‌ను ట్యాంపర్‌ చేయాలని ప్రయత్నిస్తే వెంటనే తెలిసిపోతుంది.
* పాస్‌పోర్టు చెల్లకుండా అవుతుంది.
* ఈ-పాస్‌ పోర్టులను చదివేందుకు కొన్ని సెకన్ల సమయం పడుతుంది.
* అమెరికా ప్రభుత్వ గుర్తింపు పరిశోధన శాలలో దీని నమూనాను పరీక్షించారు.
* ఈ-పాస్‌పోర్టు కవర్లు మందంగా ఉంటాయి. అక్షరాలు కాస్త బోల్డుగా కనిపిస్తాయి.
* బ్యాక్‌ కవర్‌లో చిన్న చిప్‌ ఉంటుంది.
* చిప్‌లో 64కేబీ సమాచారం పడుతుంది.
* 30 పర్యటనల వివరాలు పడుతాయి.