సామాన్య ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక రంగం ఎంతో ఆశగా ఎదురు చూసే బిగ్ డే రానే వచ్చింది. కరోనా రక్కసి ఇంకా పీడిస్తున్న వేళలో  కేంద్రం ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. 


కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నిల నగారా మోగి ప్రచారం హోరాహోరీన సాగుతోంది. రైతుల తమ పోరుకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. వేతన జీవులు సీతమ్మ కరుణించమ్మా అంటు వేడుకుంటున్నారు.  ఈ పరిస్థితుల్లో ఇవాళ 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్రం బడ్జెట్ 2022-23ను సభ ముందు ఉంచనున్నారు. 


నిర్మలా సీతారామన్‌ ఈ సారి పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతారని అంతా భావిస్తున్నారు. రూ.15 లక్షల పైనా శ్లాబులను సవరిస్తారన్న అంచనాలు ఉన్నాయి.


వేతన జీవులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ ద్వారా పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారం తగ్గించే దిశగా సాగుతున్నట్టు తెలిసింది. పన్ను భారం తగ్గించేందుకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని పెంచుతారని సమాచారం. 2022, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెబుతారని అంతా అంచనా వేస్తున్నారు.


పన్ను మినహాయింపు రూ.75వేలకు పెంపు!


ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000గా ఉంది. నిర్మలా సీతారామన్ ఈ పరిమితిని రూ.75,000 లేదా 50 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఒకవేళ పెంచితే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇది నాలుగో సారి అవుతుంది. బిజినెస్‌ ఛాంబర్లు, చాలామంది ఆర్థిక వేత్తలు బడ్జెట్‌లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని పెంచి పన్ను చెల్లింపుదారులపై ధరలు, పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.


CM.. ఇంకా చెప్పాలంటే కామన్‌ మ్యాన్‌! ఈ ఏడాది బడ్జెట్‌ నుంచి భారీగానే ఆశిస్తున్నాడు! పన్నులు తగ్గించాలని, గృహ రుణాల వడ్డీలపై మినహాయింపు పెంచాలని, సింపుల్‌గా ఆదాయపన్ను దాఖలు చేసేలా సరళీకరించాలని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచాలని FM.. అదే కేంద్ర ఫైనాన్స్‌ మినిస్టర్‌ నిర్మలా సీతారామన్‌ను కోరుతున్నాడు. మరి సామాన్యుడి వినతులను మేడమ్‌ ఆలకిస్తారా!!


కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం అన్ని రంగాల్లాగే ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఎదురుచూస్తుంది. దేశవాళీ ఉత్పత్తి పెంచడానికి, కొత్త టెక్నాలజీలు తీసుకురావడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీలు కావాలంటే భవిష్యత్తులు పెట్టుబడులను ఆహ్వానించడం తప్పనిసరి. ఈ తరహా పెట్టుబడులకు ప్రభుత్వం ఏమైనా ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తుందేమో అని పరిశ్రమ ఎదురుచూస్తోంది.


గ్రాండ్ థోర్టన్ సర్వే ప్రకారం 84 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యక్ష పన్ను రాయితీలు, ఇన్సెంటివ్‌లు అందిస్తారని అంచనా వేస్తున్నారు. స్టార్టప్ కంపెనీలకు ఆర్థిక సాయం కావాలని 74 శాతం మంది, మెరుగైన ఆటోమోటివ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ బేస్ కావాలని 75 శాతం మంది కోరారు.