కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమి తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్ 15వ తేదీన ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. కరోనాతో మరణించిన 63 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 


మార్చి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా 2వ విడతలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాల నుంచి ఇప్పటి వరకు 63 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించి ఆయా కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మార్చిలో ఆర్థిక సహాయం అందించిన వారిలో కరోనా మహమ్మారితో మరణించిన ముగ్గురు జర్నలిస్టుల కుటుంబాలకు అదనంగా మరో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అదే రోజు అందించడం జరుగుతుందన్నారు.


అనారోగ్యం బారిన పడి పని చేయలేని స్థితిలో ఉన్న నలుగురు జర్నలిస్టులకు 50 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నట్టు అల్లం నారాయణ తెలిపారు. మొత్తం 101 మంది లబ్ధి చేకూరుస్తూ  కోటి 62 లక్షల రూపాయల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కుటుంబాలకు అయిదేళ్లపాటు రూ.3000/-ల చొప్పున పెన్షన్ కూడా అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. 


కరోనా విపత్కర సమయంలో వారియర్స్ గా పని చేసిన వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులతోపాటు జర్నలిస్టులు కూడా వార్తా సేకరణలో గడ్డు పరిస్థితిలలో పని చేశారని అల్లం నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి... జర్నలిస్టులను ఆదుకుంటోందన్నారు.


ఇప్పటి వరకు మొత్తం 3,909 మందిలో తొలి విడతగా 1553 మందికి 20 వేల చొప్పున, హోంక్వారంటైన్ లో ఉన్న 87 మందికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రెండో విడతలో 2269 మందికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశామని వెల్లడించారు. కరోనా సాయంగా మొత్తం 5 కోట్ల 56 లక్షల రూపాయలు మీడియా అకాడమి నుంచి జర్నలిస్టుల ఖాతాలకు పంపిణీ చేసినట్టు అల్లం నారాయణ పేర్కొన్నారు. 


కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య ఖర్చులు, ఇతర ఇబ్బందులు ఎక్కువైనందు వలన వారికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తరఫున ప్రకటించినట్టు చెప్పారు. ఆ ప్రకటనను అనుసరించి 63 మందికి డిసెంబర్, 15వ తేదీన  మీడియా అకాడమి కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేయనున్నట్లు అల్లం నారాయణ తెలియజేశారు. 


 Also Read: Ganja Smuggling: ఏపీ దాటేశారు తెలంగాణలో దొరికేశారు... టైల్స్ లారీలో రూ.1.60 కోట్ల గంజాయి రవాణా


Also Read: Eatala Rajender: ఈటలకు షాక్.. ఆ భూముల కబ్జా నిజమేనని చెప్పిన కలెక్టర్


Also Read: BR Ambedkar Death Anniversary: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం బీఆర్ అంబేద్కర్.. ఆ బానిసలే మేలన్న రాజ్యాంగ నిర్మాత