కరోనా ప్రజల్లో మళ్లీ గుబులు రేపుతోంది. కొత్త వేరియంట్‌పై జరుగుతున్న ప్రచారం, అక్కడక్కడా పెరుగుతున్న కేసులు భయకంపితుల్ని చేస్తోంది. నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో బాలికల ప్రాథమిక పాఠశాలలో టీచర్ మరుసటి రోజున విద్యార్థికి కరోనా రావడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో పరిస్థితిపై ఏబీపీ దేశం ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పాఠశాలల్లో శానిటేషన్ సరిగ్గా లేదు. మరుగొడ్లు పరిమితంగా ఉన్నాయ్. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ్. గతంలో కూడా గురుకులాల్లోనే విద్యార్థులకు పాజిటివ్ కేసులు ఎక్కువగా రావటంతో మూసివేశారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ నేపథ్యంలో మొదట స్కూళ్లలోనే కేసులు నమోదు కావటం ఒకింత తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.


పాఠశాలల్లో అంతంత మాత్రమే శుభ్రత


ఉపాధ్యాయురాలికి, విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చిన స్కూల్‌లో ఏబీపీ దేశం పరిశీలించింది. అక్కడ తీసుకుంటున్న కరోనా చర్యలు ఎలా ఉన్నాయో చెక్ చేసింది. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ జరగటం లేదని... మరుగుదొడ్లు సరిగ్గా లేవని చెప్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇప్పటికే కరోనా భయంతో ఇళ్లల్లోకి వెళ్లిపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు.


భయాందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు


జిల్లావ్యాప్తంగా 1,759 గురుకులాలు, రెసిడెన్షియల్‌, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలున్నాయ్. 2 లక్షల 80 వేల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకుపైగా విద్యాసంస్థలు మూతపడ్డాయ్. మొదట్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినా సెప్టెంబర్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు మొదలయ్యాయ్. మొదలైన కొన్ని రోజులకు విద్యార్థుల హాజరు శాతం అంతంత మాత్రమే ఉన్నా... తర్వాత పెరిగింది. అయితే కరోనాతోపాటు కొత్త వేరియంట్స్‌పై వస్తున్న వార్తలతో మళ్లీ హాజరు శాతం తగ్గింది. విద్యార్థికి, టీచర్‌కి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా వాసులు ఉలిక్కిపడుతున్నారు. విద్యార్థులను స్కూల్‌కు పంపాలా వద్దా అన్న ఆందోళనలో ఉన్నారు.


తగ్గుతున్న విద్యార్థుల హాజరు శాతం


కరోనాతోపాటు ఒమిక్రాన్ నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ స్కూళ్లపై పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలను భయంభయంగా స్కూళ్లకు పంపుతున్నారు. మరోవైపు కరోనాకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తరగతి గదుల్లో శానిటేషన్, విద్యార్థులు మాస్కులు తప్పకుండా ధరించేలా చూస్తున్నామని పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు ఉపాధ్యాయులు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాల్లో మరుగుదొడ్లు ఒకటి రెండే ఉంటున్నాయ్. దీంతో విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నారు. పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి కానీ అలా జరగటం లేదు. కనీసం శానిటైజేషన్ కూడా చేయట్లేదని విద్యార్థులే చెబుతున్నారు. థర్డ్ వేవ్ నేపధ్యంలో ఇకనైనా స్కూల్ యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగంలో పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు కొనసాగిస్తున్నారు. 


Also Read: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే
Also Read:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Also Read: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...


Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Also Read :  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి