కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన బీజేపీ ఎన్నికల శంఖారావం సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర విజయవంతమైందని బండి సంజయ్ అన్నారు. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వచ్చాన్నారు. హుజురాబాద్ లో కాషాయ జెండాను గెలిపించాలని కోరుకున్నానని తెలిపారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. ఇక్కడ కరెన్సీ నోటుకు, కమలం పువ్వుకు పోటీ జరుగుతోందన్నారు. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడని కానీ కేసీఆర్ ఉద్యమంలో చేసిందేమీలేదన్నారు. ఆయన మధ్యలోనే నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తే విద్యార్థులు ఉద్యమించారని బండి సంజయ్ అన్నారు. విద్యార్థుల భయానికే ఆయన దీక్ష కొనసాగించారన్నారు. తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదన్న ఆయన.. మరో 10 ఏళ్లపాటు ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారని ఆరోపించారు. ఇన్నేళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటలను గెలిపించేందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు బాధ్యతలు తీసుకోవాలన్నారు.  


టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం రాజీనామా చేస్తారా: బండి సంజయ్


ప్రతి ఒక్కరూ ఒక్కో ఈటల రాజేందర్, మోదీలే పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏ రాజకీయ నాయకుడైనా తాను ప్రజలకు సేవచేయాలనే రాజకీయాల్లోకి వస్తాడని బండి అన్నారు. కేవలం డబ్బులకు అమ్ముడుపోయి, తమ రాజకీయ భవిష్యత్తును కొందరు ప్రశ్నార్థకం చేసుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ బరితెగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. కేవలం వాళ్లు డిపాజిట్ కోసమే ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.  హుజూరాబాద్  లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఎన్నికలు వాయిదా వేయాలని కేసీఆర్ లేటర్ల మీద లేటర్లు రాశారని ఆయన అన్నారు. కానీ ఎన్నికల కమిషనర్ కేసీఆర్ జేబు సంస్థ కాదన్నారు. ఆయన అక్కడున్నప్పుడే ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిందన్నారు. దుబ్బాకలో గెలిచినా, మరోచోట ఓడినా ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతామని బండి సంజయ్ తెలిపారు.  గెలిచే అవకాశం ఉన్నచోట కేటీఆర్ ను, ఓడిపోయే చోట హరీశ్ రావును ఇంఛార్జ్ గా పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దళితబంధును బీజేపీ వ్యతిరేకించలేదని తెలిపారు.  ఇచ్చిన రూ. పది లక్షలు ఏమైనా చేసుకోవచ్చని చెప్పి ఇప్పుడు దళితబంధుపై ఆంక్షలు పెట్టారన్నారు. అకౌంట్లో వేసిన డబ్బులు ఫ్రీజింగ్ చేశారన్నారు. 


Also Read:  రసవత్తరంగా హుజూరాబాద్ ఉపఎన్నిక... అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ... అభ్యర్థి ఎవరంటే..?


బీసీల బంధు ఎందుకు ప్రకటించలేదు?


బీసీల బంధు ఎందుకు ప్రవేశపెట్టరని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారన్న ఆయన.. వాళ్లకు కూడా రూ.పది లక్షలు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ గిమ్మిక్కులతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఈటల రాజేందర్ ఘనవిజయం సాధిస్తారన్నారు. ఇప్పటికే రాజాసింగ్, రఘునందన్ రావు రూపంలో డబుల్ ఆర్ అసెంబ్లీలో ఉన్నారన్నారు. ఈటల రాజేందర్ గెలుపుతో అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ అవుతారన్నారు. కేసీఆర్ కు త్రిబుల్ ఆర్ సినిమా చూపిస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  2023లో 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలుస్తారన్నారు.  


Also Read: ముగిసిన బండి సంజయ్ తొలిదశ పాదయాత్ర... సీఎం కావాలని పాదయాత్ర చేయడంలేదన్న సంజయ్... వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా 


నాపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారు : ఈటల రాజేందర్


ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా రెండు పనులు చేశానన్న ఆయన... ఒకటి హుజూరాబాద్ అభివృద్ధి అయితే, రెండోవది బీసీలలో ఉన్న కులాలతో అసెంబ్లీలో మీటింగ్ పెట్టీ వారికి ఏం కావాలో ప్రతిపాదనలు చేసినన్నారు. రజకులకు రూ.250 కోట్లతో  డ్రై క్లీనింగ్ మిషన్ లు కొనివ్వాలని ప్రతిపాదన చేస్తే డబ్బులు లేవని కేసీఆర్ ఆపేశారన్నారు. తాను రాజీనామా చేస్తేనే ఇన్ని వస్తే గెలిస్తే ఇంకా ఎన్ని వస్తాయో అన్నారు. ఓటుకి రూ.20 వేలు ఇస్తారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఒక్క బీసీ బిడ్డ కూడా సీఎం కాలేదన్నారు. మీటింగ్ కి వస్తే కరెంటు కట్ చేశారని ఆరోపించారు. బీజేపీ మీటింగ్ కి పోవద్దని దావత్ లు ఇస్తున్నారని, బెదిరిస్తున్నారన్నారు. తమ సహనానికి పరీక్ష పెట్టవద్దన్నారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నియంతృత్వాన్ని ప్రజలపై రుద్దుతున్నారని ఈటల ఆరోపించారు. 13, 14 తేదీల్లో తనపై దాడి చేయించేందుకు ఓ మంత్రి, ఎమ్మెల్యే కుట్రలు చేస్తున్నారన్నారు. జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు 2+2 గన్ మెన్ ఉంటారన్నారు. కానీ తనకు మాత్రం ఒక్కరినే ఇచ్చారన్నారు.  హుజురాబాద్ లో బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగితే చాలు గెలుస్తామన్నారు. 


Also Read: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల విమర్శలు.. అభివృద్ధి ఎక్కడంటూ మాజీ మంత్రికి కౌంటర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి