హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అడుగుపెట్టింది. తాజాగా ఆ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సుదీర్ఘమంతనాల తర్వాత ఏఐసీసీ బల్మూరి వెంకట్ పేరును ప్రకటించింది. అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా హుజూరాబాద్ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌లో బరిలో నిలవబోయే అభ్యర్థిని ప్రకటించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ని అభ్యర్థిగా ప్రకటించింది. ఏఐసీసీ బల్మూరి వెంటక్‌ పేరుని అధికారికంగా వెల్లడించింది. 


Also Read: తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు.. నన్ను గెలిపించండి: ఈటల రాజేందర్


వెంకట్ పేరు ఖరారు 


టీఆర్‌ఎస్‌ తరఫున గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను హుజూరాబాద్ బరిలో దించారు. దీంతో కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ పేరును ఖరారు చేసింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెంకట్ పేరును ప్రతిపాదించారు. మాజీ మంత్రులు, కరీంనగర్‌ జిల్లా నేతలు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌ బాబులు మద్దతిచ్చారు. ఈ నిర్ణయంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ కూడా ఆమోదం తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, భట్టి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ మరోసారి సమావేశమై వెంకట్‌ పేరును ఖరారు చేసి అధిష్టానానికి పంపించినట్లు తెలుస్తోంది.




Also Read: హుజురాబాద్‌ ఉపఎన్నిక చాలా కాస్ట్‌లీ గురూ ! ప్రభుత్వం.. పార్టీల ఖర్చు ఎంతో తెలుసా ?


విద్యార్థి సంఘం నేతగా కీలక బాధ్యతలు 


బల్మూరి వెంకట్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన విద్యార్థి నాయకుడు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన సొంతూరు ఉంది. 2018 ముందస్తు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి వెంకట్ టికెట్‌ ఆశించినప్పటికీ భంగపాటుతప్పలేదు. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినప్పటికీ విద్యార్థి సంఘం నేతగా వెంకట్‌ కీలకంగా వ్యవహరించారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారంలో ఆందోళనలు చేశారు. దీంతో వెంకట్ పై కేసులు కూడా నమోదయ్యాయి. విద్యార్థి అంశాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు వెంకట్ కృషి చేస్తున్నారు. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ వెంకట్‌ను బరిలో దింపింది. 


Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ప్రచార వ్యూహాలు షురూ.. మార్నింగ్ వాక్‌లో మంత్రి, గ్రౌండ్‌లో ఎక్సర్‌సైజులు


రసవత్తర పోటీ


మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల అనివార్యమైంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఎన్నికల్లో నిలబడ్డారు. ఈ ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం కోసం రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను నిలిపింది. దీంతో పోటీ రసవత్తంగా మారింది. తాజాగా కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది.   


Also Read: నామినేషన్ దాఖలు చేసిన గెల్లు శ్రీనివాస్.. ప్రచారంలో పలువురు నేతల మద్దతు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి