Breaking News Live: నిజామాబాద్.. గన్నారంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Dec 2021 02:52 PM
నిజామాబాద్.. గన్నారంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం ప్రారంబొత్సవానికి ఎంపీ అరవింద్ వచ్చారు. ఉదయమే పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం ప్రారంభించిన టీఆర్ఎస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు. అనంతరం ఎంపీ అరవింద్ ఓపెనింగ్ కార్యక్రమానికి రావటంతో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంపీ అరవింద్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలకు స్వల్పంగా గాయాలయ్యాయి.

వంగ‌వీటి వ‌ర్దంతి వేడుక‌ల్లో రాధాకృష్ణ‌తో క‌ల‌సి పాల్గొన్న వల్లభనేని వంశీ

వంగ‌వీటి మోహ‌న్ రంగా వ‌ర్దంతి వేడుక‌ల్లో ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ‌తో క‌ల‌సి వల్లభనేని వంశీ పాల్గొన్నారు.ఈ వ్య‌వ‌హ‌రం వైసీపీ, టీడీపీలో కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అటు కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల్లో కూడ హాట్ టాపిక్ గా మారింది. గ‌త ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న వంగ‌వీటి రాధా, టీడీపీలో చేర‌టం.. ఎన్నిక‌లు త‌రువాత టీడీపీ నుండి గెలిచిన వంశీ వైసీపీ పంచ‌న చేర‌టం అంద‌రికి తెలిసిందే. ఈ త‌రుణంలో రంగా విగ్ర‌హం సాక్షిగా ఇరువురు నేత‌లు పాల్గొన‌టం, దివంగ‌త నేత రంగాను ఉద్దేశించి వంశీ మాట్లాడ‌టం కూడా అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ ప‌రిణామాల్లో ఎన్ని మ‌లుపులు తిరుగుతాయ‌నే చ‌ర్చ జ‌రుగుతుంది..

యూట్యూబ్ లో పనిచేసేవాళ్లంతా జర్నలిస్టులు కాదు.. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

యూట్యూబ్ లో పనిచేసేవాళ్లంతా జర్నలిస్టులు కారని తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అలాంటి వారికి ఏ గుర్తింపు ప్రాతిపదిక ఏదీ లేదు అన్నారు. యూట్యూబ్ రిపోర్టర్లను ప్రోత్సహించవద్దని, వాళ్లు జర్నలిస్టులు కాదు అని స్పష్టం చేశారు. అసలు రాజ్యాంగంలో ప్రత్యేక మైన స్వేచ్ఛ అంటూ లేదు. భావ ప్రకటన పేరుతో కంట్లో పొడుస్తా అంటే ఎలా అని ప్రశ్నించారు. యూట్యూబ్ చానల్స్ వాళ్ళ వల్ల  మీడియా విశ్వసనీయతకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన జర్నలిస్టులు తమ ఉనికిని చాటుకో లేకపోతున్నారు, వాస్తవాలను వెలికి తీయడం లేకపోతున్నారు. యూట్యూబ్ రిపోర్టర్లు, పీడీఎఫ్ పేపర్స్ రిపోర్టర్లు ఎట్టి పరిస్థితిలో జర్నలిస్టులు కారు అని, వారికి ఎలాంటి క్రెడిబిలిటి లేదు అలాంటి వారిని ప్రోత్సహించవద్దు అని అల్లం నారాయణ కోరారు.

సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు

ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో కాల్పుల కలకలం రేపాయి. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మద్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక్కరు మృతి చెందగా.. మరో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో అది పెద్ద గొడవ అయి ఒకర్నొకరు కాల్చుకొనే వరకూ వెళ్లిందని తోటి జవాన్లు చెబుతున్నారు.

ఫ్రాన్స్‌లో ఒకేరోజు లక్షకు పైగా ఒమిక్రాన్ కేసులు

ఫ్రాన్స్​లో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,04,611 మందికి పాజిటివ్​గా తేలినట్లు ఫ్రాన్స్ శానిటరీ అథారిటీ వెల్లడించింది. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్య శాఖ మంత్రి ఒలీవర్ వెరన్ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఒమిక్రాన్ కేసులే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఆంక్షలు కఠినతరం చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

అనంతలో ఒమిక్రాన్‌ కలకలం

అనంతపురం జిల్లాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శనివారం రాత్రి ప్రకటించింది. ఈనెల 18న యూకే నుంచి బెంగళూరు విమానాశ్రయం మీదుగా అనంతపురానికి వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి కొత్త వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. విదేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా 20న సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు. 21వ తేదీన ఫలితాలు రాగా.. కరోనా నిర్ధారణ అయింది. దీంతో జీనోమ్‌ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి నమూనాలు పంపారు. శనివారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ఆ వ్యక్తికి ఒమిక్రాన్‌ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

వరి ధాన్యంలో మంటలు..

* పుంగనూరు మండలం, కంటేపల్లి గ్రామ‌ సమీపంలోని ఓ బండపై వరి ధాన్యంలో మంటలు..


* బండపై ఉన్న వరి ధాన్యంకు నిప్పు అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు..


* వరి ధాన్యం ఆగ్నికి ఆహుతి కావడంతో ఆవేదనలో రైతులు..


* క్వారీ యజమాని మల్లెల పవన్ కుమారే వరి ధాన్యాలకు నిప్పు అంటించారని అనుమానం వ్యక్తం చేస్తున్న రైతులు..


* రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు..

Background

హైదరాబాద్ అమీర్ పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన కే నవీన్ కుమార్ అనే 24 ఏళ్ల వ్యక్తి మధురానగర్‌లోని ఈఫిల్ టెక్ సొల్యూషన్స్‌లో పని చేస్తున్నాడు. అమీర్‌పేటలోని లక్ష్మీనర్సింహ పురుషుల హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇతను శనివారం హాస్టల్ భవంతి ఆరో అంతస్తు నుంచి దూకాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


పిల్లల వ్యాక్సిన్‌కు అనుమతులు
భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌‌ను 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చింది. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విస్తరిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టీకాను ఇప్పటికే 18 ఏళ్లు మించిన వయసు వారికి ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పిల్లలకు సైతం ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కొంతకాలం కిందట భారత బయోటెక్‌ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలోనే పిల్లలపై నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని, సంబంధిత ఇతర వివరాలను కూడా అందించింది. ఈ సమాచారాన్ని పరిశీలించి డీజీసీఐ సానుకూలం వ్యక్తం చేసింది.


వాతావరణం
చలిగాలుల కాస్త తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి గాలులు వీచడంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గాలులు వీస్తున్నప్పటికీ తాజాగా ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ దిశగా గాలులు వీచడం మొదలైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం లేదని సమాచారం. ఉత్తరాది గాలుల ప్రభావం తగ్గడంతో ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో కొన్ని చోట్ల పొగ మంచు కురియడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరగనున్నాయి. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతోంది. విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలో అత్యల్పంగా 9.2 డిగ్రీలు, చింతపల్లిలో 13.9 డిగ్రీలు, జీకే వీడిలో 8.2 డిగ్రీలు, పెదబయలులో 8.3  డిగ్రీలు, మాడుగులలో 12.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల 6 కంటే తక్కువ దిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు తాజాగా 8 డిగ్రీలు పైగా నమోదయ్యాయి. కొన్ని చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని, ఉదయం వేళ వాహనాలు జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు ప్రజలకు సూచించారు.


బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిలకడగా ఉంది. వెండి ధర విషయంలోనూ అదే పరిస్థితి కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,350 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,480 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,350 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,480గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,100గా ఉంది.


పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 26) దాదాపు 2 వారాల తర్వాత మార్పు కనిపించింది. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 గా అయింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.09 పైసలు తగ్గి రూ.110.00 గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు తగ్గి రూ.96.29 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.32గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.10 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.43 గా ఉంది. ఇది రూ.0.09 పైసలు పెరిగింది.


ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.06 పైసలు పెరిగి రూ.110.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు పెరిగి రూ.96.44గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.