టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాతావరణం బాగా లేనట్టే అనిపిస్తోంది! కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆటగాళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయని తెలిసింది. కోచ్‌ రవిశాస్త్రినీ కాదంటూ విరాట్‌ నిర్ణయాలు తీసుకుంటున్నాడని సమాచారం. వీటన్నిటినీ పరిష్కరించి, ఆటగాళ్లు, కెప్టెన్‌ మధ్య సయోధ్యను కుదిర్చేందుకే ఎంఎస్ ధోనీని మెంటార్‌గా నియమించారని వార్తలు వస్తున్నాయి.


Also Read: తిరుగులేని ధోనీసేనపై సన్‌రైజర్స్‌ నిలవగలదా? జేసన్‌ రాయ్‌పైనే ఆశలన్నీ!


ఏక పక్షంగా నిర్ణయాలు
ప్రస్తుతం టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ రెండు వర్గాలు విడిపోయిందని అంటున్నారు. విరాట్‌ కోహ్లీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఆటగాళ్లను నిందిస్తున్నాడని సమాచారం. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓటమి తర్వాత నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌లో మందలించాడని వార్తలు వస్తున్నాయి! వారిని అలా తిట్టడం మిగతా ఆటగాళ్లకూ నచ్చలేదని తెలిసింది.


Also Read: 'శ్రీకర విజయం'.. మాక్సీ విధ్వంసం: ప్లేఆఫ్స్‌ దిశగా బెంగళూరు


డ్రెస్సింగ్‌ రూమ్‌లో అవమానం
తమ వ్యక్తిత్వం, మ్యాచును గెలిపించేందుకు పడుతున్న తపనను కోహ్లీ ప్రశ్నించడం ఆ ముగ్గురు ఆటగాళ్లకు నచ్చలేదు. దాంతో వీరంతా బీసీసీఐ కార్యదర్శి జేషాకు ఫిర్యాదు చేశారని తెలిసింది. అంతేకాకుండా ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసులో అశ్విన్‌ను పక్కన పెట్టడమూ బోర్డు పెద్దలకు నచ్చలేదు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ తర్కంతో అతడు జడేజాకు చోటిచ్చాడు. ఓవల్‌ పిచ్‌పై యాష్‌కు మెరుగైన రికార్డున్నా, రవిశాస్త్రి చెప్పినా అతడిని ఎంపిక చేయలేదు. ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారింది. ఒకప్పటిలా పరుగులు చేయకపోవడం, ఫామ్‌లో లేకపోవడమూ కోహ్లీ నిర్ణయాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. గంగూలీ, జే షా వచ్చాక బీసీసీఐలో అతడి పట్టు తగ్గిపోయింది!


Also Read: వీరూ రికార్డుకు పంత్‌ బీటలు.. మేమేమైనా తక్కువా అంటున్న శ్రేయస్‌, ధావన్‌!


సయోధ్య కోసమే ధోనీ!
ఈ నేపథ్యంలోనే విరాట్‌ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. వన్డేలకు సారథ్యం వహిస్తానని చెబుతున్నా అదీ కుదరకపోవచ్చు! ప్రపంచకప్‌ తర్వాత అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్‌ నాయకత్వం నుంచి పూర్తిగా తప్పిస్తారని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌ కీలకం కావడంతో ప్రస్తుతానికి వ్యవహారం సద్దుమణిగేలా చేసేందుకు ఎంఎస్‌ ధోనీని నియమించారని తెలిసింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాతావరణం చల్లబరిచి, ఆటగాళ్లు, కెప్టెన్‌ మధ్య సయోధ్య కుదిర్చేందుకే అతడిని నియమించారని అంటున్నారు. మరికొన్నాళ్లు ఆగితే నిజానిజాలేంటో బయటపడే అవకాశం ఉంది.


Also Watch: పరువు కోసమే సన్ రైజర్స్ పోరు