Mystery Of The Invisible City Shambala: హిమలాయాల్లో అడుగడుగునా ఉన్న ఎన్నో రహస్యాల్లో శంబల ఒకటి. భాగవతపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణుపురాణం, బౌద్ధులు విశ్వశించే కాలచక్రం గ్రంధంలో సీక్రెట్ సిటీ శంబల గురించి ఉంది.
శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో చివరిది కల్కి. ఆయన జన్మించబోయే పవిత్ర ప్రదేశమే శంబల. దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతం. హిమాలయాల్లో అంతుచిక్కని ప్రదేశం. 1903వ సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు గూఢచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు. అప్పట్లో హిమాలయాల్లో తాము చూసిన వింతలన్నింటిపై ఓ నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి శంబల చూడాలనే ఆలోచన అందర్లోనూ కలిగింది.
శంబలకు మార్గం
శంబల సంస్కృత పదం..టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అంటారు. హిందూ పురాణాల్లో సిద్ధాశ్రమం అని, భూలోక త్రివిష్టపం ( భూలోక స్వర్గం) అని అంటారు. రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే టిబెట్ బౌద్దులు ఎక్కువగా నివశించే ప్రాంతం. దీని సరిహద్దులో చైనా భూభాగంలో ఉన్న కైలాశ పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంబల కూడా ఉంది. ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగ మార్గం ఉంది..ఆ మార్గం గుండా వెళ్తే గడ్డకట్టిన మంచునది ఉంటుంది. దాని అడుగున సొరంగం.. అది దాటితే ఓ పర్వతం..అందులో గుహ ఉంటాయి. ఇక్కడ సిద్ధపురుషులు తపస్సు చేస్తుంటారు. వారిని దాటుకుంటూ వెళితే మంచుకొండల మధ్య స్పటిక పర్వతం, శ్రీ చక్రం కనిపిస్తాయి..ఈ పర్వతం కింద రహస్యంగా ఉన్న నగరమే శంబల. టిబెటన్లు శంబలను ఇప్పటికీ మంత్రశక్తిగల ప్రాంతంగా విశ్వశిస్తారు.
Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!
13వ దలైలామా రాసిన గ్రంధాల్లో శంబల ప్రస్తావన
13వ దలైలామా తన గురువు తాషీలామాతో కలసి తాళపత్ర గ్రంధాల్లో రాసిన ఎన్నో రహస్య విషయాల్లో ఈ శంబల గురించి కూడా ఉంది. 'శంబలకు వెళ్లే దారి' అనే పేరుతో తాషీలామా ఓ గ్రంధాన్ని రచించారు. హిమాలయా పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలామంది మహర్షులు ధ్యానంలో ఉన్నారు. శంబలలో వయసుని స్తంభింపజేసి నిత్యయవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి. అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులున్నాయని తాషీలామా రాసిన గ్రంధంలో ఉన్నాయి.
శంబల మార్గాన్ని గీసిన రష్యా చిత్రకారుడు
శంబల గురించి ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి నికోలస్ రోయిచ్ అంటారు. అంతకు ముందే శంబల గురించి ప్రస్తావనలు వినిపించినా నికోలాస్ రోయిచ్ రాసిన పుస్తకాల ఆధారంగానే శంబల గురించి ఎక్కువ వివరాలు తెలిసాయి. రష్యన్ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసాఫిస్ట్, తత్వవేత్త అయిన నికోలస్ రోయిచ్...భారతీయ సంప్రదాయాలకు ముగ్ధుడై కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోయాడు. ఆయన మరణించే వరకూ శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. రోరిచ్ మరణం తర్వాత శంబలకు సంబంధించిన రహస్యాలు చాలా వెలుగుచూశాయి. కులులో ఉన్న రోరిచ్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. శంబలకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని..ఆయన గీసిన బొమ్మలన్నీ నిశితంగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుందటారు. కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన ఓ గుర్రం శకిలిస్తుందని రోరిచ్ పుస్తకంలో ఉంది. ఓ జీవ శిల దేశంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని..సరిగ్గా కల్కి జననానికి ముందు శంబల చేరుకుంటుందని తన రచనల్లో ప్రస్తావించాడు రోరిచ్. ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు..కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లోనూ ఇది కనిపిస్తుంది.
Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!
శంబల నగరంపై హిట్లర్ ఆసక్తి
రోరిచ్ రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలను చూసిన తర్వాత శంబలపై హిట్లర్ కి ఆసక్తిపెరిగింది. అక్కడ అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుని తన గూఢచారులను పంపించాడు. కానీ శంబల గురించి ఏ వివరాలు తెలుసుకోలేకపోయాడు.
1889వ శతాబ్ధంలో జన్మించిన సన్యాసిని ఆనందమయి హిమాలయాల్లో 20 అడుగుల ఎత్తున్నవారిని చూశానని చెప్పారు..వారంతా ద్వాపర యుగానికి చెందినవారని అంటారు.
రష్యాకు చెందిన హెలీనా అనే సాహసి కూడా తన రాసిన పుస్తకాల్లో శంబల గురించి ప్రస్తావించారు..
Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
బియాస్ నది కాదు వ్యాస్ నది
కలియుగం ప్రారంభానికి ముందు శంబలలో వ్యాస మహర్షి తపస్సుచేశాడు..హిమాలయాల్లో ప్రవహించే బియాస్ నది అసలు పేరు వ్యాస్ నది. కాలక్రమేణా బియాస్ గా మారింది. భాగవతం చివరి స్కందం వ్యాసుడు ఈ ప్రాంతంలోనే రచించాడని చెబుతారు. అందుకే భాగవత చివరి స్కందంలో కల్కి అవతారం, శంబల గురించి...ధర్మ సంస్థాపన గురించి రాశారు.
ప్రస్తుతానికి మాయా నగరమే!
ఎక్కడుందో తెలిసినప్పుడు..ఇప్పుడు ఎవరైనా వెళ్లేందుకు ప్రయత్నించారా అంటే...లేదనే చెప్పాలి. ఎందుకంటే కల్కి జన్మించబోయే భూలోక స్వర్గం లాంటి శంబలను చూడాలంటే...పరిపూర్ణమైన మనసు, యోగిశక్తి, దైవబలం ఉండాలి. అలాంటి వారు మాత్రమే శంబలను చూడగలను. అప్పటివరకూ మాయానగరమే. కేవలం కల్కి జన్మించిన తర్వాత మాత్రమే జన బాహుళ్యంలోకి వస్తుంది శంబల... అప్పటివరకూ మాయానగరమే....