Tirumala:  కలియుగదైవం కొలువైన తిరుమల క్షేత్రాన్ని సందర్శించేవారంతా..స్వామివారి అన్నప్రసాదం తప్పనిసరిగా స్వీకరిస్తారు. అయితే వెంగమాంబ భోజనశాలలో గోడమొత్తం ఓ పెయింటింగ్ కనిపిస్తుంది. అద్భుతమైన ఆ పెయింటింగ్ మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఆ పెయింటింగ్ లో నాలుగు లొకేషన్లు కనిపిస్తాయి..ఓ పెద్ద రూట్ మ్యాప్ ఉంటుంది.. అవేంటో వివరించే కథనం ఇది...


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


శేషాచలం అడవులలో ఐదు పుణ్యక్షేత్రాలున్నాయి...ఆ ఐదు పుణ్యక్షేత్రాలేంటో సూచించేదే ఈ పెయింటింగ్. సిద్ధులు, యోగులు ఆ ఐదు క్షేత్రాలను ధ్యానించినప్పుడు..ఆదిశేషుడు పాకుతున్నట్టు కనిపించే ఆ ప్రదేశాల్లో పడగఎత్తి కనిపించే ప్రదేశం తిరుమల.. వాలం చివర ఉన్న ప్రదేశం శ్రీశైలం... మరి మధ్యలో మరో మూడు పుణ్యక్షేత్రాలేంటి. ఇక్కడ తిరుమల, శ్రీశైలం గురించి తెలుసు..మరి మధ్యలో ఉన్న మూడు ప్రదేశాల గురించి తెలుసుకుందాం...


1. తిరుమల


2. అహోబిలం


3. మహానంది


4. త్రిపురాంతకం


5. శ్రీశైలం



అహోబిలం


108 దివ్య తిరుపతుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి రెండు... ఒకటి తిరుమల, రెండోది అహోబిలం. ఈ క్షేత్రంలో..నృసింహస్వామి ఆవిర్భవించిన స్తంభం ఇప్పటికీ అక్కడుంది. హిరణ్య కశిపుడి పొట్ట చీల్చేసిన తర్వాత స్వామివారు చేతులుకడుకున్న కొలను కనిపిస్తుంది. ఇక్కడ కొండపై 6 నరసింహులు కొండ కింద ముగ్గురు నరసింహులు ఉన్నారు. నవగ్రహదోషాలున్నవారు ఈ నవనారసింహులను దర్శించుకుంటే ఆ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి! 
 
మహానంది


నందీశ్వరుడు.. పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది. కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం ఇది. పురాణకథనం ప్రకారం... ఓ ఆవు నిత్యం ఓ ప్రదేశానికి వచ్చి పుట్టలో పాలు వదిలేసేది. ఆ పుట్టలో కొలువైన పరమేశ్వరుడికి నిత్యం అభిషేకం చేసేది. అసలు ఏం జరుగుతోందో గమనిద్దామని ఆవుని అనుసరించిన పశువుల కాపరి..ఓ పుట్టలో పాలు వదిలేయడం చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే పెద్ద కర్ర తీసుకుని ఆవుని కొట్టాడు..ఆ సమయంలో ఆవు తూలిపోతూ కాలి గిట్టను శివలింగంపై మోపి పడిపోకుండా నిలబడింది. బిడ్డ పాద స్పర్శకు తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారో...ఆ ఆవు చేసిన పనికి కూడా పరమశివుడు అంతే మురిసిపోయాడు. అందుకే మహానందిలో శివలింగంపై ఆవుగిట్ట ముద్ర ఉంటుంది. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే గర్భగుడిలో ఉన్న శివలింగం కింద నుంచి మూడు నీటి బుగ్గలు ఊరుతూ గోముఖం నుంచి పుష్కరిణిలో చేరుతాయి.  


త్రిపురాంతకం
 
తిరుమల నుంచి వెళితే నాలుగోది...శ్రీశైలం నుంచి వస్తే మొదటిది త్రిపురాంతకం. త్రిపురాసుర సంహారం తర్వాత పరమేశ్వరుడు ఇక్కడ  కొలువయ్యాడు. ఇక్కడ గర్భగుడిలో ఉన్న పంచముఖ శివలింగంపై..పైనుంచి గంగమ్మ పడుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీ చక్రం ఆకారం ఉన్న పీఠంపై నిర్మించారు. చిన్న గుట్టపై ఉన్న ఈ ఆలయం నుంచి కిందకు దిగివస్తే అమ్మవారు త్రిపురసుందరిగా కొలువైంది. వానాకాలం వస్తే అమ్మవారి విగ్రహం నీట మునిగిపోతుంది..ఆ సమయంలో ఆ పక్కనే ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రానికి పూజలు చేసుకోవచ్చు.


ఇక తిరుమల,శ్రీశైలం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... ఇదీ వెంగమాంబ భోజన శాలలో కనిపించే పెయింటింగ్ అర్థం...


Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!