Tirumala Vyuha Lakshmi  Mantras:  తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చేస్తే కష్టాల నుంచి ఉపశమనం లభించినట్టే అని భక్తుల నమ్మకం. అయితే చాలామంది తీవ్రమైన సమస్యలలో కూరుకుపోయినవారికి అప్పుడు కూడా ఉపశమనం లభించదు. అలాంటివారికోసమే తిరుమల కొండపై వ్యూహలక్ష్మి వ్రతం గురించి చెప్పారు పండితులు. దీనివెనుక ఓ ప్రచారంలో ఉన్న కథను కూడా చెబుతున్నారు...


ఆత్మారాముడు అనే ఓ వ్యక్తి.. కుటుంబంతో కలసి సంతోషంగా ఉండేవారు. తీవ్రమైన దారిద్ర్యానికి లోనవుతాడు. కుటుంబం, బంధువుల నుంచి నిర్లక్ష్యానికి గురై ఆత్మహత్యచేసుకోవాలి అనుకుంటాడు. అప్పుడు ఓ మహనీయుడు కనిపించి...ఆత్మహత్య మహాపాపం, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు క్షేత్రాలు తిరిగితే ఎక్కడోచోట దైవానుగ్రహం లభిస్తుందని చెబుతాడు. తిరిగి తిరిగి..ఆఖరికి తిరుపతికి చేరుకుంటాడు. కపిలతీర్థం దగ్గర స్నానమాచరించి కొండెక్కుతుండగా..ఓ గుహలోంచి ఓంకారం వినిపిస్తుంది. ఆ గుహలోకి వెళ్లిచూస్తే ఓ మహర్షి ఉంటారు..ఆయన పాదాలపడి నేను ఏ తప్పూ చేయలేదు..ఈ జన్మలో ఎందుకింత కష్టం అని బాధపడతాడు. అప్పుడు ఆ మహర్షి...ఈ జన్మలో చేసిన పాపం కాదు.. ఇదంతా నీ ప్రారబ్ధ కర్మఫలం అని చెబుతాడు. కపిలతీర్థంలో స్నానమాచరించడంతో ఆ కర్మ భారం కొంతవరకూ తగ్గింది..ఇప్పుడు తిరుమల కొండపైకి వెళ్లి వ్యూహలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోమని చెప్పి మూలమంత్రం, ఎలా చేయాలనే ప్రక్రియను చెబుతాడు. అప్పుడు ఆయన కొండపైకి వెళ్లి పుష్కరిణి దగ్గర కూర్చుని  41 రోజుల పాటూ కఠోర సాధన చేసిన తర్వాత వ్యూహలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమై సకల సంపద ప్రసాదించిందని చెబుతారు. 


ఈ వ్రతాన్ని 3,5,7,9,11..40 ఇలా ఎన్ని రోజులైనా చేయొచ్చు..ఇంట్లోకాదు తిరుమల కొండపైనే చేయాలి. ముందుగా కపిలతీర్థంలో స్నానమాచరించి శ్రీవారి పుష్కరిణి దగ్గరకు వెళ్లాలి. మూడు పూటలా స్నానమాచరించి పుష్కరిణి దగ్గర కూర్చుని ఆలయం వైపు తిరిగి అమ్మవారిని కళ్లలో నింపుకుని ధ్యానం చేయాలి. దీక్ష పూర్తైన తర్వాత స్వామిని , ఆయన హృదయం పై ఉన్న వ్యూహలక్ష్మిని దర్శించుకోవడంతో వ్రతం పూర్తైనట్టు. దీనికి సంబంధించిన 8 శ్లోకాలు...


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


శ్రీ వ్యూహ లక్ష్మీ మంత్రం


1. దయాలోల తరంగాక్షీ పూర్ణచంద్ర నిభాననా । జననీ సర్వలోకానాం మహాలక్ష్మీః హరిప్రియా ॥  


(దయా తరంగాలను ప్రసరించే కళ్లు - పూర్ణ చంద్రుడి లాంటి ముఖం..సర్వలోకాలను అమ్మకు..నువ్వే చూడాలి నన్ను )


2. సర్వపాప హరాసైవ ప్రారబ్ధస్యాపి కర్మణః । సంహృతౌ తు క్షమాసైవ సర్వ సంపత్ప్రదాయినీ ॥  


(పుట్టెటప్పుడు తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మను సంహరించు..నన్ను క్షమించి సంపదలు ప్రసాదించు)


3. తస్యా వ్యూహ ప్రభేదాస్తు లక్షీః సర్వపాప ప్రణాశినీ । తత్రయా వ్యూహలక్ష్మీ సా ముగ్ధాః కారుణ్య విగ్రహ ॥  


(లక్ష్మి, కీర్తి, జయ అనే మూడు రూపాలతో అమ్మవారు అనుగ్రహిస్తుంది..ఈమూడింటికి మూలం స్వామివారి వక్షస్థలంపై ఉన్న కారుణ్య రూపం)


4. అనాయాసేన సా లక్ష్మీః సర్వపాప ప్రణాశినీ । సర్వైశ్వర్య ప్రదా నిత్యం తస్యా మంత్రమిమం శృణు ॥ 


( అనాయాసంగా సర్వపాపాలను నాశనం చేసేస్తుంది..ఆ మంత్రోపదేశమే తర్వాత శ్లోకాలు)


వ్యూహలక్ష్మీ మంత్రః (108 సార్లు చదవాల్సిన 2 శ్లోకాలివే)


5. వేదాదిమాయై మాత్రే చ లక్ష్మ్యై నతి పదం వదేత్ ।పరమేతి పదం చోక్త్రా లక్ష్మ్యా ఇతి పదం తతః ॥  


6. విష్ణు వక్షః స్థితాయై స్యాత్ మాయా శ్రీతారికా తతః । వహ్ని జాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః ॥  


7. విభూజా వ్యూహలక్షీస్స్యాత్, బధ్ధ పద్మాసన ప్రియా । శ్రీనివాసాంగ మధ్యస్థా సుతరాం కేశవప్రియా ॥  


8. తామేవ శరణం గఛ్ఛ సర్వభావేన సత్వరమ్ । ఇతి మంత్రం ఉపాదిశ్య దదృశే న కుత్రచిత్ ॥


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి! 
 
 కేవలం 5,6 శ్లోకాలను మీరు వ్రతం చేయాలి అనుకున్నన్ని రోజులు 108 సార్లు చేస్తే  లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. తిరుమలలో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితం పొందుతారు..అక్కడకు వెళ్లే అవకాశం లేనివారు మీకు సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో కూర్చుని చేయండి..


Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!