Makar Sankranti Specila 2024 Significance Of Rangoli:  తెలుగువారి పండుగలలో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పేరు వినగానే అందమైన రంగవల్లులు గుర్తొస్తాయి. రంగు రంగుల ముగ్గులతో ప్రతి లోగిలీ కళకళలాడుతుంది. మూడు రోజుల పాటూ ఎంతో ఘనంగా నిర్వహించే ఈ పండుగలో రంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు.  గొబ్బెమ్మలను గోదాదేవిగా, లక్ష్మీ దేవిగా, గౌరీ మాతగా భావించి పూజిస్తారు. సంక్రాంతి పండుగ రోజు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ సమర్పించి,  పూలతో అలంకరిస్తారు.  రైతులు పండించిన పంటలు సంక్రాంతికి ఇంటికి చేరడం వల్ల కొత్త ధాన్యాలను కూడా ఆ గొబ్బెమ్మల లో వేసి ధాన్య లక్ష్మి గా పూజిస్తారు. అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు ఉన్న లోగిలిలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం. అందుకే నిత్యం ముగ్గు ప్రధానం అయినా సంక్రాంతికి రంగు ముగ్గులు, గొబ్బెమ్మలు మరింత ప్రత్యేకం. 


Also Read: సంక్రాంతి పండుగ వెనుక ఎన్ని కథలున్నాయో తెలుసా!


ఇంతకీ ముగ్గులు ఎందుకు వేయాలి



  • ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు  ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా అడ్డుకోవడమే కాదు  ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి

  • ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం. అందుకే పండుగల సమయంలో ఇలా వేయాలంటారు పెద్దలు.

  • దేవుడి పూజ చేసే సమయంలో పీటపై మధ్యలో చిన్న ముగ్గువేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పనిసరిగా గీయాలి

  • నక్షత్రం ఆకారంలో వేసే ముగ్గు నెగెటివ్ వైబ్రేషన్స్ ని దరిదాపులకు రాకుండా చేస్తుంది

  • ఇంటి ముందు వేసే పద్మం ముగ్గువెనుక యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడుశక్తిని ఆపుతుందని చెబుతారు

  • దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.


Also Read: సంక్రాంతికి ముగ్గులో 'సిరులు పొంగే కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!


బియ్యంపిండితో ముగ్గు వేయాలి
నిత్యం ముగ్గులు వేయలేక పెయింట్ లు వేసేవారున్నారు కానీ  శాస్త్రం ప్రకారం  ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. ఆ బియ్యం పిండిని పక్షులు తినడంమే  కాదు.. ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తులు అక్కడే ఆగిపోతాయని పెద్దలు చెబుతారు. ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానించేందుకే.


ఇంటి ముంగు ముగ్గులేకపోతే..
ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేరో చెప్పే సూచనగా ముగ్గుని చూసేవారు అప్పట్లో. ఎందుకంటే సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ప్రతి ఇంటికీ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటిముందు ముగ్గులేకపోతే ఆ ఇంటికి వెళ్లేవారు కాదట. ఇంటి తలుపులు తెరిచి ఉన్నా ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ఆ అంటినుంచి బిక్ష స్వీకరించేవారు కాదట. అందుకే ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు ఉండదు.  శ్రాద్ధకర్మలు చేసిన వెంటనే ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన తర్వాత  ముగ్గువేస్తారు. అందుకే ఇల్లంతా కడిగిన తర్వాత  ముగ్గువేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు పండితులు


Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!


దేవాలయంలో నిత్యం ముగ్గువేసే స్త్రీకి ఏడు జన్మల వరకూ వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తారని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి. ముగ్గు అంత ప్రత్యేకం....


Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!