Ganesh Chaturthi 2023: ఏ దేవుడికైనా పూలు, అక్షతలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి పూజ చేస్తారు. కానీ పార్వతీ తనయుడి పూజకు మాత్రం పత్రి తప్పనిసరి. పూలున్నా లేకపోయినా పత్రిని వినియోగిస్తారు. వినాయకునికి చేసే ఏకవింశతి పత్రి (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. అవేంటి? పత్రితో లంబోదరుడిని ఎందురు పూజించాలి? నిమజ్జనం రోజు వీటిని కూడా గంగలో ఎందుకు వేస్తారో తెలుసా?


Also Read: వినాయ‌క చ‌వితి 18, 19 తేదీల్లో ఏ రోజు జ‌రుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!


పత్రి పూజ వెనుకన్న పరమార్థం


వినాయకుడిని 21 రకాల పత్రితో పూజిస్తారు. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే  పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. వాటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్య పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు లాంటిదన్నమాట. 


మాచీపత్రం
మంచి సువాసన ఉన్న ఆకు ఇది. ఈ ఆకు వాసన తగిలినా తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.


బృహతీపత్రం
దగ్గు, ఉబ్బసం, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను నివారించేందుకు బృహతీపత్రం ఉపయోగపడుతుంది


బిల్వపత్రం 
బిల్వపత్రం ఆకు పసరు చర్మ దోషాలను నివారిస్తుంది


దూర్వాపత్రి
రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది.


దత్తూరపత్రం
ఆస్తమా,  దగ్గు, కీళ్లనొప్పులకు మంచి మందు దత్తూర పత్రం. ఈ ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాటులకు మందుగా పనిచేస్తుంది


బదరీ పత్రం
ఈ పత్రం అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది


అపామార్గ పత్రం 
గాయాలను తగ్గించడంతో పాటూ చర్మ సమస్యలన్నింటికీ అద్భుతంగా పనిచేస్తుంది


చూతపత్రం ( మామిడి)
భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైంది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


Also Read: శివుడికి పంచారామ క్షేత్రాల్లా గణేషుడికి అష్టవినాయక ఆలయాలు, వీటి విశిష్టత ఏంటంటే!


కరవీర పత్రం
కరవీరపత్రం తలలో చుండ్రు తగ్గిస్తుంది కానీ ఈ మొక్క విషతుల్యమైనది..అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి


విష్ణుక్రాంతపత్రం
దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, జ్వరాలను నివారిస్తుంది ఈ పత్రి


దాడిమీపత్రం
శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను హరింపజేస్తుంది దాడిమీపత్రం


దేవదారుపత్రం
దేవదారుపత్రం నుంచి తీసిన తైలం... చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, పేగుల్లో పుండ్లకు, కండరాల బలోపేతానికి, లైంగిక ఉత్ప్రేరణకు ఉపయోగపుడుతంది దేవదారు పత్రం


మరువకపత్రం
నరాల బలహీనత తగ్గించేందుకు, చెవిపోటు, నొప్పులకు ఔషధంగా ఉపయోగపడుతుంది


సింధువారపత్రం
వాతం, తనొప్పులను తగ్గిస్తుంది.  పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది


జాజిపత్రి
ఈ ఆకులు శరీరానికి వేడినిచ్చి మంచి శక్తిని కల్పిస్తాయి. వాపులును తగ్గిస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి.


గండకీపత్రం
కడుపులో నులిపురుగులను హరించివేసేందుకు ఉపయోగపడుతుంది గండకీ పత్రం


శమీపత్రం
ఈ ఆకురసం మాడుకి చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టుగాలి స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 


అశ్వత్థపత్రం
శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు అశ్వత్థపత్రాన్ని వినియోగిస్తారు


అర్జునపత్రం
అర్జునపత్రం బెరడుతో తయారయ్యే కషాయం గుండెను ఆరోగ్యంగా, పదిలంగా ఉండటానికి పనిచేస్తుంది


అర్కపత్రం
తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు శరీరాన్ని కాంతివంతం చేస్తాయి


తులసీదళం
దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు, క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది. అయితే తులసితో వినాయకుడికి పూజ చేయరు..కానీ వినాయకచవితి ఒక్కరోజు పూజిస్తారు


ఈ పత్రాలన్నింటితో పూజించి చివరిగా ‘ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి’ అంటూ పూజను ముగించాలి.


Also Read: వినాయక పూజ చేయడమే కాదు - ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా!


ప్రకృతిని కొలవడం, భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికీ, ఆడంబరానికీ పెద్ద పీట వేస్తున్నాయి. అందుకే మట్టి గణేషుడినే పూజించి నిమజ్జనం చేయాలి. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలవడంతో వాటిలో ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించడమే కాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.  మిగిలిన పండుగలు, దేవుళ్లకు నిమజ్జనం హడావుడి ఉండదు..పైగా వానాకంల మొదలైన వెంటనే చవితి పండుగ వస్తుంది కాబట్టి...కొత్తగా వచ్చే నీటిని శుద్ధి చేస్తాయి ఈ పత్రిలన్నీ...అందుకే ఏకవింశతి పత్రి పూజ చేయాలని చెబుతారు. 


Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.