Ganesh Chaturthi 2023: వినాయకుడికి ప్రత్యేక క్షేత్రాలు అనగానే కాణిపాకం అని ఠక్కున చెబుతారు. ఇంకా చాలా ఉన్నాయి...అయితే అన్నిటిలో మరింత ప్రత్యేకం అష్టవినాయక ఆలయాలు. ముక్కంటి పంచారామ క్షేత్రాలను ఒకేరోజు దర్శించుకుంటే ఎంత ఫలితమో ఈ అష్టవినాయక ఆలయాలను కూడా ఒక్కరోజులో దర్శించుకుంటే అంతకు మించిన ఫలితం అని చెబుతారు పండితులు. మహారాష్ట్రలో ఉన్న వీటిని ఒకేరోజు దర్శించుకోవడం కష్టమే కానీ..సరైన ప్రణాళిక వేసుకుంటే అయ్యే అవకాశం ఉంది. అష్టవినాయకుల దర్శనం ఏ ఆలయంలో ప్రారంభిస్తారో మళ్లీ అక్కడకు వచ్చినప్పుడే యాత్ర పూర్తైనట్టు. 


మహాగణపతి (Mahaganapati Temple at Ranjangaon)


సిద్ధి, బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజన్‌గావ్‌ వినాయకుడు మహాగణపతి. పూర్వం త్రిపురాసురుడితో యుద్ధానికి దిగిన శివుడు ఓడిపోయాడు. అప్పుడు నారదమహర్షి  సంకటమోచన గణపతి స్తోత్రాన్ని శివుడికి తెలియజేసి వినాయకుడిని తలుచుకోమని చెబుతాడు. ఆ తర్వాత శివుడు త్రిపురాశుర సంహారం చేస్తాడు. తన  విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని శంకరుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడంటారు


సిద్ధి వినాయకుడు (Siddhivinayak Temple at Siddhatek)
పూర్వం మధుకైటభులనే రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూ వినాయకుడి సాయం అర్థించాడట. శ్రీహరి అభ్యర్థన మేరకు రణరంగంలో ప్రత్యక్షమైన వినాయకుడు ఆ రాక్షసులను మట్టుబెట్టాడు. వినాయకుడి వరం వలన కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రం అయింది. శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించి గణపతిని ప్రతిష్ఠించాడట. ఇక్కడ స్వామి వారి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది.


Also Read: వినాయ‌క చ‌వితి 18, 19 తేదీల్లో ఏ రోజు జ‌రుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!


గిరిజాత్మజ వినాయకుడు (Girijatmaj Temple at Lenyadri)


గిరిజాత్మజుడంటే పార్వతీదేవి కుమారుడు అని అర్ధం. ఎత్తైన కొండమీద ఒక గుహలో కొలువై ఉంటాడీ వినాయకుడు. స్వామి దర్శనం కోసం 238 మెట్లు ఎక్కాలి. పుత్రుడి కోసం పార్వతీదేవి పన్నెండేళ్లు తపస్సు చేసిన పుణ్య ప్రదేశం ఇది. నలుగు పిండితో విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో అలా  ఉంటుందిక్కడి విగ్రహం.


బల్లాలేశ్వరుడు (Ballaleshwar Temple at Pali)


పుణెకి 100 కిలో మీటర్ల దూరంలో పాలి క్షేత్రంలో వెలసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి అనుకోవచ్చు. బల్లాల్‌ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి  ఆ పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థలపురాణం.


వరద వినాయకుడు (VaradVinayak Temple at Mahad)


మహడ్‌ క్షేత్రంలో కొలువైన స్వామి వరద వినాయకుడు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుక్మాంగదుడనే మహారాజు వాచక్నవి అనే రుషి దర్శనార్థం ఈ గ్రామానికి వచ్చాడట. రాజు వైభోగాన్ని కళ్లారా చూసిన రుషిపత్ని ముకుంద ఆ రాజుపై మనసు పడింది. రాజు అందుకు ఒప్పుకోడు.  అప్పుడు రుక్మాంగదుడే మహారాజు రూపంలో ఆమెను సమీపించాడు. అలా కలిగిన పుత్రుడికి గృత్సమధుడు అనే  పేరు పెట్టారు.పిల్లవాడు పెరిగి పెద్దైన తర్వాత తన జన్మరహస్యం తెలుసుకుని అందరి పాపాలు తొలగిపోవాలని వినాయకుడిని ప్రార్థించాడు. భక్తికి మెచ్చిన గణనాథుడు కోరిన వరం ప్రసాదించి అక్కడే స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ గర్భగుడిలోని దీపం వందేళ్లుగా అఖండంగా వెలుగుతోందని చెబుతారు


Also Read: 'నాస్తికో వేదనిందకః'- కలియుగంలో ఇంతేనా, సనాతనధర్మంపై వివాదం ఈ కోవకే చెందుతుందా!


చింతామణి గణపతి (Chintamani Ganapathi)


షోలాపూర్‌ పుణె మార్గంలో ఉండే థేవూర్‌ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు గణపయ్య. పూర్వం కపిల మహాముని వద్ద కోరిన కోర్కెలు తీర్చే ‘చింతామణి’ అనే రత్నం ఉండేదట. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత మహారాజు కొడుకైన గణరాజు కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లడంతో అప్పటికప్పుడు చింతామణి సాయంతో విందు ఏర్పాటు చేశాడు కపిల మహాముని. ఆ విషయం తెలుసుకున్న గణరాజు చింతామణిని ఎత్తుకుపోయాడు. గణరాజుని చంపి ఆ మణిని తీసుకొచ్చి తిరిగి మహర్షికి ఇచ్చాడు వినాయకుడు. అలా అక్కడే కొలువైన గణపతిని చింతామణి గణపతి అంటారు.


మయూరేశ్వరుడు( Moreshwar Temple at Morgaon)


పుణె జిల్లా బారామతి సమీపం మోర్‌గావ్‌ గ్రామంలో వెలసిన వినాయకుడు మూషికవాహనంపై కాకుండా మయూరంపై దర్శనమిస్తాడు. ఒకప్పుడు సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసించేవాడట. దీంతో మునులు దేవతలను వేడుకోగా వినాయకుడు తన తమ్ముడి వాహనాన్ని అధివసించి భువికి దిగివచ్చి ఆ రాక్షసుణ్ని మట్టుబెట్టాడు. అందుకే ఈ గణేశుణ్ని మయూరేశ్వరుడు, మోరేష్‌, మోరేశ్వర్‌ అని పిలుస్తారు. 


విఘ్న వినాయకుడు (Vighnahar Temple at Ozar)


ఓఝూర్‌ ప్రాంతంలో ఒకప్పుడు విఘ్నాసురుడనే రాక్షసుడు మునుల జపతపాదులకు భంగం కలిగించేవాడు. మునులంతా వినాయకుడిని ప్రార్థించారు.  రణం మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఆ రాక్షసుడు వినాయకుడి ముందు మోకరిల్లాడు. తన పేరుమీద అక్కడే కొలువుతీరాలని వేడుకున్నాడు. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.