Yam ka Diya  Date Time Shubh Muhurat 2024:

  ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవం అయిన ధన్వంతరి జయంతి రోజు ధన త్రయోదశి. ఈయనను ఆరాధించడంతోనే దీపావళి వేడుకలు మొదలవుతాయి. అయితే ఇదే రోజు సాయంత్రం ప్రతి ఇంటి బయటా దీపం వెలిగిస్తారు. దానిని యమదీపం అంటారు. 


ధన త్రయోదశి రోజు ఇంటిబయట దీపం వెలిగించడం ద్వారా అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. దీని వెనుక ఓ పురాణగాథ కూడా చెబుతారు. 


Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!


పూర్వకాలంలో ‘హిమ’ అనే రాజుకు చాలా కాలానికి ఓ కుమారుడు జన్మిస్తాడు. అయితే తన జాతకం చూసిన పండితులు.. పెళ్లి జరిగిన నాలుగు రోజులకే మరణిస్తాడని చెబుతారు. అందుకే ఆ రాకుమారుడికి వివాహం చేయకూడదు అనుకుంటాడు. కానీ కాలక్రమంలో ఆ రాకుమారుడిని వరించిన ఓ రాకుమారి పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతుంది. తన జాతకం గురించి చెప్పినా కానీ..తాను వరించిన వ్యక్తితే మనువాడుతా అంటుంది. ఇరువైపుల పెద్దలు చేసేది లేక సరే అంటారు. తన భర్తని తాను కాపాడుకోగలను అని ధీమాగా చెబుతుంది ఆ రాకుమారి. పెళ్లి జరిగిపోతుంది. నాలుగో రోజు వచ్చింది. ఆ రోజే ధన త్రయోదశి.. ఉదయం నుంచి సౌభాగ్య వ్రతం చేయడం ప్రారంభించిన ఆ రాకుమారి.. సాయంత్రానికి ఇంటి ద్వారం దగ్గర దీపం వెలిగించింది. ఇరు వైపులా బంగారం, వెండి ఆభరణాలు రాశులుగా పోసింది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణం తీసేందుకు పాము రూపంలో వచ్చిన యముడు... ఆభరణాలపై దీపం వెలుగు నగలపై పడడంతో ఆ వెలుగుకి కళ్లు చెదురుతాయి. మరోవైపు యువరాణి గానానికి మైమరిచి అక్కడే ఆగిపోతాడు యముడు. ఈ లోగా మృత్యు ఘడియలు దాటిపోయాయి. దీంతో చేసేది లేక యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లిపోతాడు. 


Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!


అప్పటి నుంచి ధన త్రయోదశి రోజు వెండి, బంగారు ఆభరణాలు కొనడం.. ఆ రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర దీపం వెలిగించడం ద్వారా మృత్యు భయం తొలగిపోతుందనే సెంటిమెంట్ బలపడింది.  మట్టి ప్రమిదలు కానీ, పిండితో తయారు చేసిన ప్రమిదల్లో కానీ ఆవునెయ్యి లేదా నువ్వులనూనె పోసి దీపారాధన చేయాలి. అష్టదిక్పాలకుల్లో యముడు దక్షిణ దిక్కుకి అధిపతి..అందుకే ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ధాన్యం రాశిగా పోసి ఈ దీపాలు వెలిగించాలి. ఇలా దీపం వెలిగించడం వల్ల అకాల మరణాలు ఉండవని నమ్ముతారు. 


ధన త్రయోదశి రోజు తమ వంశాంకురాలను చూసేందుకు పితృదేవతలు దిగివస్తారట..వారికి దారి చూపించేందుకు దక్షిణ దిశగా దీపాలు వెలిగించాలని కూడా చెబుతారు.  


యమదీపం వెలిగించేటప్పుడు ఇది చదవాలి
 
'మృత్యునాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సః
త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మామ్'


ఈ ఏడాది త్రయోదశి తిథి తగులు-మిగులు వచ్చింది. అంటే అక్టోబరు 29 మంగళవారం ఉదయం పదిన్నరకు త్రయోదశి ఘడియలు ప్రారంభమై అక్టోబరు 30 బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకూ ఉన్నాయి. యమ దీపం సూర్యాస్తమయం సమయంలో వెలిగించాలి కాబట్టి.. అక్టోబరు 29 సాయంత్రం, అక్టోబరు 30 సాయంత్రం రెండు రోజులూ ఈ దీపం వెలిగించడం మంచిది...


Also Read: భారతదేశంలో వివిధ ప్రాంతాలలో దీపావళిని ఎలా జరుపుకుంటారు - దాన ధర్మాల్లో భాగంగా ఏమిస్తారు!