Agniveer Recruitment Rally In Guntur: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ (Agniveer Recruitment) ర్యాలీకి సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన వెలువడింది. గుంటూరులోని (Guntur) డీఎస్ఏ (DSA) స్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. నవంబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ర్యాలీ ఉంటుందని.. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్‌లో భాగంగా.. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ టెన్త్ ట్రేడ్స్‌మెన్, అగ్నివీర్ 8th ట్రేడ్స్ మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.


అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను తీసుకురావాలని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం www.joinindinaarmy.nic.inలో అప్ లోడ్ చేయబడిన అన్ని పత్రాలను తీసుకురావాలన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్, పారదర్శకంగా ఉంటుందని.. దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. ఉద్యోగ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఉన్న వారినే ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులకు తొలుత ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా 1,600 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇతర ఈవెంట్లు, పరీక్షలు ఉంటాయి. రోజుకు వెయ్యి మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది.


Also Read: Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు