వైసీపీకి బిగ్ షాక్ - ఏకకాలంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా


వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్‌రావు (Beeda MasthanRao) ఏకకాలంలో పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు సమర్పించారు. వీరిద్దరూ బుధవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఛైర్మన్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను అందించారు. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఇదే దారిలో మరికొందరు ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీలో, మరికొందరు బీజేపీలో చేరతారని సమాచారం. రాజ్యసభలో ఏపీకి మొత్తం 11 స్థానాలున్నాయి. ఇంకా చదవండి


రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్


తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి, ఛాత్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 48 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల నుంచి అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 5 వరకూ వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నారు. కాచిగూడ - తిరుపతి - కాచిగూడ, సికింద్రాబాద్ - నాగర్‌సోల్ - సికింద్రాబాద్, కాకినాడ - సికింద్రాబాద్ - కాకినాడ, తిరుపతి - మచిలీపట్నం - తిరుపతి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. రెగ్యులర్ రైళ్లకు ఇవి అదనపు సర్వీసులని.. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఇంకా చదవండి


తిరుపతి లడ్డూ కావాలా నాయనా!


తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇకపై ఆధార్ ఉంటేనే లడ్డూలు జారీ చేసేలా దేవస్థానం నిర్ణయించింది. గురువారం నుంచి నూతన విధానం అమల్లోకి తెచ్చింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా రూల్స్ మార్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చదవండి


ఓటుకు నోటు కేసులో బిగ్ అప్‌డేట్‌


ఓటు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న బీఆర్‌ఎస్ నేత జగదీష్ రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని కోరుతూ చాలా రోజు క్రితం జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. జగదీశ్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ఇంకా చదవండి


సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటి మీదికి హైడ్రా బుల్డోజర్లు


ఎన్‌ కన్వెన్షన్‌తోపాటు కీలకమైన నేతల నివాసాలు, భవనాలు కూల్చేస్తున్న హైడ్రా అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూడా కూల్చేందుకు నోటీసులు జారీ చేశారు. మాధాపూర్‌లోని అమర్‌ కో ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు అంటించారు. ఈ ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వస్తుందని గుర్తించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చదవండి