Breaking News: గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.50 కోట్ల వరకూ ఆస్తి నష్టం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 19న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 19 Sep 2021 10:53 PM
గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్ చేసే కర్మాగారంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

నల్గొండలో రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

నల్గొండ జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముత్యాలమ్మగూడెం వద్ద కారు కంటైనర్‌ను ఢీకొని చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. ముత్యాలమ్మగూడెం వద్ద మరో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. 

గచ్చిబౌలిలో రూ.18.50 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

గచ్చిబౌలిలో రూ.18.50 లక్షలకు గణేశ్ లడ్డూ పలికింది. మై హోం భూజా అపార్ట్‌మెంట్‌లో గణేశ్ లడ్డూ వేలం పాటలో రూ.18.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు విజయభాస్కర్‌రెడ్డి.

నెల్లూరు జిల్లాలో రెండు రోడ్డు ప్రమాదాలు

నెల్లూరు జిల్లాలో ఒకే రోజు గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి. రెండు బైక్ లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మర్రిపాడు మండలం పరిధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయి. తాజాగా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిగ సమీపంలో మరొక ప్రమాదం జరిగింది. కృష్ణపట్నం పోర్టు నుంచి బళ్లారి వైపు  బొగ్గు లోడుతో వెళ్తోన్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. లారీ డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.


 

బాలాపూర్ లడ్డూకు రికార్డ్ ధర... సొంతం చేసుకున్న కడప వాసి

హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను కడప జిల్లాకు చెందిన మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సొంతం చేసుకున్నారు. రూ.18.90 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూను సీఎం జగన్ కానుకగా ఇస్తానని ఆయన తెలిపారు. 

ఏపీలో బాలికపై అత్యాచారం.. ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు..

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనలో నిందితుడిగా ఉన్న సత్యప్రకాశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం సత్యప్రకాశ్‌కు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.  

పిడుగుపాటుకు ఇళ్లు దగ్ధం... మంటల్లో కాలిపోయిన రూ. 20 లక్షల నగదు 

పిడుగుపాటుకి రూ.20 లక్షలు దగ్ధమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం పశ్చిమగోదావరి జిల్లా గురుభట్లగూడెంలో కాళ్ల కృష్ణవేణి, ఆమె కుమారుడు ఇంట్లో ఉండగా పక్కనే ఉన్న గడ్డివాము నుంచి మంటలు అంటుకున్నాయి. గడ్డివాముపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. బాధితులు అప్రమత్తమై బయటకు వచ్చారు. ఇటీవలే భూమిని అమ్మగా వచ్చిన రూ.20 లక్షల నగదు, బంగారం మంటల్లో పూర్తిగా కాలిపోయిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 19న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.