మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్ట‌ైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు రోజూ ఇంటి భోజ‌నం తెప్పించుకునేందుకు అనుమ‌తించాల‌ని అనిల్ దేశ్‌ముఖ్ కోర్టును కోరారు. అయితే ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తోసిపుచ్చింది. "ముందుగా జైలు కూడు తినండి. ఒక‌వేళ తిన‌లేక‌పోతే అప్పుడు మీ అభ్య‌ర్థ‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాం" అని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది.


అయితే, త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా ఒక బెడ్ ఏర్పాటు చేయాల‌న్న అనిల్ దేశ్‌ముఖ్ అభ్య‌ర్థ‌న‌ను మాత్రం కోర్టు మ‌న్నించింది. ఆయ‌న‌కు కేటాయించిన గ‌దిలో బెడ్ ఏర్పాటుకు అనుమ‌తించింది.


ఈనెల 2న అరెస్ట్


అనిల్ దేశ్​ముఖ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) ఈనెల 2న అర్ధరాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్​ముఖ్​తో పాటు కుందన్​ షిందే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్‌ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది.