సునంద పుష్కర్ కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్‌కు భారీ ఊరట కలిగింది. ఆమె హత్య కేసులో శశి థరూర్‌పై నమోదైన అభియోగాలను ఢిల్లీ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు కొట్టిపారేసింది. విచారణ చేపట్టిన కోర్టు.. ఈ కేసులో కాంగ్రెస్ నేతకు క్లీన్ చిట్ ఇచ్చింది. శశి థరూర్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ స్పెషల్ జడ్జి జస్టిస్ గీతాంజలి గోయల్ తీర్పు వెలువరించారు.


కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ 17 జనవరి 2014లో ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె మరణంపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితులు సహకరించడం లేదని, వారికి లై డిటెక్టర్ పరీక్షలు సైతం నిర్వహించారు. మొదట ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించినా.. చివరికి అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పర్సనల్ అసిస్టెంట్ నారాయణ సింగ్ డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ ధావన్‌లను పోలీసులు విచారించి పలు విషయాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి శశి థరూర్ పై సైతం పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.
Also Read: Afghanistan Crisis Live Updates: తాలిబన్లను అఫ్గాన్ ప్రభుత్వంగా పరిగణించే ప్రసక్తే లేదు... కెనడా ప్రభుత్వం


దాదాపు ఏడున్నరేళ్లు విచారణ అనంతరం శశి థరూర్‌కు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. భార్య సునంద పుష్కర్ ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని, కాంగ్రెస్ ఎంపీనే ఆమె మరణానికి కారణమనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీ ప్రత్యేక కోర్టు సునంద పుష్కర్ కేసును మరోసారి విచారించింది. శశి థరూర్ న్యాయవాది విచారణకు హాజరై.. కాంగ్రెస్ ఎంపీకి కేసుతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి విషయాలు విన్నవించుకున్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఢిల్లీ స్పెషల్ కోర్టు శశి థరూర్‌కు ఊరట కలిగించింది. భార్య సునంద పుష్కర్ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది.
Also Read: గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం

భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఊరట లభించిన అనంతరం శశి థరూర్ స్పందించారు. ఏడున్నరేళ్లు నరకం అనుభవించాను, ఎట్టకేలకు ఊరట లభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై భారం దిగినట్లుగా ఉన్నట్లు కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. కాగా, తాలిబన్లతో హిందూ, సిక్కు నేతలు సమావేశం కానున్న నేపథ్యంలో గా, అఫ్గానిస్థాన్ లో 'మలయాళీ తాలిబన్లు' ఉన్నారని శశి థరూర్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఆయన తీరుపై సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
Also Read: Weather Updates: ఈ జిల్లాలకు అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి