Fact Check Files missing in Animal Husbandry office Hyderabad: హైదరాబాద్: ప్రభుత్వం మారిన తరువాత మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్ మాయం కావడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం కావడం తెలిసిందే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్‌ మాయం అయ్యాయి. కొందరు దుండగులు కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఆఫీసులోకి చొరబడి ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్‌ ఎలిజ, వెంకటేష్‌, ప్రశాంత్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ముఖ్యమైన ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఆఫీసులో ఫైల్స్ మాయం కావడాన్ని శుక్రవారమే అధికారులు గుర్తించారు. ఫైల్స్ చోరీపై అధికారులు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా డీసీపీ శ్రీనివాస్ ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కొన్ని ఆధారాలు సైతం సేకరించినట్లు సమాచారం. అక్కడి శాఖ డైరెక్టర్ ను డీసీపీ ప్రశ్నించడంతో.. తనకు ఎలాంటి సమాచారం లేదని డైరెక్టర్ చెప్పారు. ఫైల్స్‌ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, లెక్కల్ని మొత్తం బయటకు తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న క్రమంలో ఆఫీసుల నుంచి ఫైల్స్ చోరీకి యత్నం జరగుతుండటం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.


ఫైల్స్ మాయం కాలేదు, అందులో నిజం లేదు.. 
పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని మాజీమంత్రి  తలసాని మాజీ OSD కళ్యాణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సచివాలయం ప్రారంభమై 9 నెలలు కావస్తుందని, మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నాటి మంత్రి తలసాని కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని  2 వ అంతస్తులోకి తరలించి కార్యకలాపాలు నిర్వహించారని తెలిపారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్ ను నిర్దిష్టమైన విధానంలో ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేశామని చెప్పారు. ప్రభుత్వ మార్పిడి ఫర్నిచర్, ఇతర సామాగ్రి ని GAD కి అప్పగించే ప్రక్రియ లో భాగంగా నే మాసాబ్ ట్యాంక్ కార్యాలయానికి తాను కానీ, తమ కార్యాలయ సిబ్బంది వెళ్లినట్లు తెలిపారు. శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని తెలిపారు. ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కళ్యాణ్ కుమార్ చెప్పారు.


బషీర్‌బాగ్‌ లో ఫైల్స్ చోరీకి యత్నం.. ఆటో వదిలి పరార్
పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ వివాదాస్పదంగా మారుతున్న సమయంలో హైదరాబాద్ లో మరో చోట ఫైల్స్ చోరీకి దుండగులు యత్నించారు. బషీర్‌బాగ్‌ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో ఫైల్స్ చోరీ చేయాలని ప్రయత్నించారు. ఆటోలో ఫైల్స్‌ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా కొందరు అధికారులు గమనించి దుండగుల్ని అడ్డుకున్నారు. భయంతో నిందితులు ఆటోను వదిలి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. కాగా, విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ కూడా ఉంది. దాంతో సబిత ఛాంబర్ నుంచి ఫైల్స్ ఏమైనా చోరీ చేయాలని చూశారా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 


Also Read: మేము ఎల్లప్పుడూ ప్రజల పక్షమే - రైతుబంధు ఎప్పుడు జమ చేస్తారని ప్రభుత్వానికి హరీష్ రావు ప్రశ్న


Also Read: Free Bus Scheme in Telangana: మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు పథకాలు ప్రారంభం - 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి