Kejriwal On AAP Party: 'ఆప్‌ పుట్టుకకు దేవుడే కారణం- గుజరాత్‌లో మా విజయం తథ్యం'

ABP Desam Updated at: 19 Sep 2022 11:49 AM (IST)
Edited By: Murali Krishna

Kejriwal On AAP Party: ఆమ్ఆద్మీ పార్టీ దేవుడి జోక్యం వల్లే పుట్టిందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

(Image Source: PTI)

NEXT PREV

Kejriwal On AAP Party: దిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ఆవిర్భావానికి దేవుడే కారణమని ఆయన అన్నారు. దిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆప్‌ తొలి జాతీయ సమావేశం 'రాష్ట్రీయ జన ప్రతినిధి సమ్మేళన్‌'లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



ఆప్‌ఆద్మీ పార్టీ పుట్టుక ఏదో యాదృచ్ఛికం కాదు. దేవుడి జోక్యం వల్లే ఇది సాధ్యమైంది. దేవుడు దేశాభివృద్ధి కోసం ఆప్‌ అనే విత్తనాన్ని నాటాడు. అది మొలకెత్తి ప్రతీ రాష్ట్రంలోనూ పెరుగుతూ.. మనకు మరిన్ని బాధ్యతలను అప్పజెప్పుతోంది. దిల్లీ, పంజాబ్‌లో వృక్షాలుగా ఎదిగి.. అక్కడి ప్రజలకు సంక్షేమ ఫలాలు, నీడను అందిస్తోంది. గుజరాత్‌లోనూ ఈ ఆప్‌ విత్తనం.. చెట్టుగా ఎదగడం ఖాయం.                                                   -  అరవింద్ కేజ్రీవాల్, ఆప్‌ అధినేత


శ్రీకృష్ణుడితో


ఆమ్‌ ఆద్మీ పార్టీని శ్రీకృష్ణుడితో పోల్చుతూ కేజ్రీవాల్ చేసిన ప్రసంగానికి పార్టీ కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.



పుట్టిన పదేళ్లలో ఇంతలా ఎదిగిన పార్టీ బహుశా దేశంలో ఆప్‌ మాత్రమే కావొచ్చు. పసి వయసులో కృష్ణుడి ఎలాగైతే రాక్షస సంహారం చేశాడో.. అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి రాక్షసులను ఆప్‌ వధిస్తుంది. దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడం మాత్రమే కాదు.. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానిక విభాగాల్లో, పంచాయితీల్లో 1,446 మంది ఆప్‌ ప్రతినిధులు పదవుల్లో కొనసాగుతున్నారు.                                              - అరవింద్ కేజ్రీవాల్, ఆప్ అధినేత


తొలిసారి జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఢిల్లీలోని 62 మంది ఎమ్మెల్యేలు, పంజాబ్‌కు చెందిన 92 మంది ఎమ్మెల్యేలు, గోవా నుంచి ఇద్దరితో పాటు మొత్తం 10 మంది ఆప్ ఎంపీలు పాల్గొన్నారు. ఇదే సమావేశంలో భాజపాపైనా చర్చించారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలమవడంపై విస్తృతంగా చర్చలు జరిపారు. భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు సిద్ధం చేసుకునేందుకు ఈ మీటింగ్‌లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గత నెల మేక్ ఇండియా నంబర్ 1 (Make India No1) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను వెల్లడించారు. "ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్ ఇచ్చి భారత్‌ నంబర్ వన్ అయ్యేందుకు సహకరించండి" అని పిలుపునిచ్చారు. "ఈ మిషన్‌లో పాల్గొనాలని అనుకునే వాళ్లు 9510001000 నంబర్‌కి మిస్డ్‌ కాల్ ఇవ్వండి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్‌ను మార్చేందుకు సహకరించండి" అని విజ్ఞప్తి చేశారు.


Also Read: Mukesh Ambani: గురువాయూర్ క్షేత్రాన్ని సందర్శించిన అంబానీ- రికార్డ్ స్థాయిలో భారీ విరాళం!


Also Read: యూరప్‌‌లో ఎత్తైన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించిన తెలంగాణ కుర్రాడు, హర్యానా గవర్నర్ అభినందనలు

Published at: 19 Sep 2022 11:47 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.