‘బిగ్ బాస్’ సీజన్-5లో రన్నరప్‌గా నిలిచిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌(Shanmukh Jaswanth)కు అతడి గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన(Deepthi Sunaina) ఊహించని షాకిచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా అతడితో కలిసి.. చిల్ అవుతున్న ఫొటో పోస్ట్ చేస్తుందని భావించిన అభిమానులకు.. ‘బ్రేకప్’ అంటూ షాకిచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వెబ్‌సైట్స్‌లో చక్కర్లు కొడుతున్న వార్తలు నిజమని తేల్చేసింది. అయితే, షన్ముఖ్ జస్వంత్ మాత్రం ఇంకా ఈ పోస్ట్‌పై స్పందించలేదు. 


‘బిగ్ బాస్’ సీజన్-5లో ఫేవరెట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన షన్ముఖ్.. తన ఆట కంటే సిరితో స్నేహం మీదే ఎక్కువ దృష్టిపెట్టాడనే విమర్శలు వచ్చాయి. సిరి కూడా షన్నుకు పదే పదే హగ్‌లిస్తూ చనువుగా ఉండేది. అది ఫ్రెండ్‌షిప్ హగ్ అని బయటకు సర్దిచెప్పినా.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఏదో జరుగుతుందనే ఫీలింగ్ మాత్రం ప్రేక్షకుల్లో ఉంది. అయితే, దీప్తి మాత్రం.. వారి స్నేహంపై పెద్దగా స్పందించేది కాదు. 


బిగ్ బాస్ ప్రారంభంలో.. షన్ను పుట్టిన రోజు సందర్భంగా దీప్తి తొలిసారి మీడియాకు తెలిసేలా అతడికి ‘ఐ లవ్ యూ’ చెప్పింది. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ వేదిక మీదకు కూడా వచ్చి.. కళ్లతోనే అతడితో రొమాన్స్ చేసింది. వారి కెమిస్ట్రీ చూసి నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. అదే వేదికపై సిరి బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త శ్రీహన్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘నన్ను వదిలేస్తావా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిరి తల్లి కూడా బిగ్ బాస్‌ హౌస్‌లోకి వెళ్లి ‘హగ్స్’ వద్దని హెచ్చరించింది. అయినా సరే.. వారిలో మార్పురాలేదు. ఆ తర్వాత వారి మధ్య కెమిస్ట్రీ మరింత ముదిరినట్లు కనిపించింది. హౌస్‌లో వారిద్దరూ చనువుగా ఉండటం దీప్తి సునయనాకు నచ్చలేదని తెలుస్తోంది. గ్రాండ్ ఫినాలేకు కూడా దీప్తి హాజరుకాలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా షన్ముఖ్‌ను కలిసేందుకు దీప్తి ఇష్టపడలేదు. 


అయితే, దీప్తి సునయన కూడా ‘బిగ్ బాస్’ సీజన్-2లో కంటెస్టెంట్. అప్పట్లో ఆమె నటుడు తనీష్‌తో చనువుగా ఉండేది. ఆమె బయటకు వచ్చాక.. షన్ను, దీప్తిలకు బ్రేకప్ అయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి. షన్ను అభిమానులు ఇప్పటికీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. అయితే, అలాంటిదేమీ లేదని ఇద్దరూ ఆ వార్తలను ఖండించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పలు కవర్ సాంగ్స్ చేశారు. ‘బిగ్ బాస్’ సీజన్-5లోకి వెళ్లే ముందు కూడా వారు.. ‘మలుపు’ అనే వీడియో సాంగ్‌లో కనిపించారు. అందులో వారిద్దరూ ఓ వైరస్ వల్ల దూరమవుతారు. చివరికి ఆమె దాన్ని లెక్క చేయకుండా హాస్పిటల్‌లో ఉన్న అతడిని కలిసి.. చివరి వరకు నీతోనే జీవితమంటుంది. 






 ఇన్‌స్టాగ్రామ్‌లో షన్నుతో బ్రేకప్ గురించి చెబుతూ... ‘‘ఎంతో ఆలోచించి, మాట్లాడుకున్న తర్వాత.. షన్ముఖ్, నేను పరస్పర అంగీకారంతో విడిపోయి ఇక వ్యక్తిగతంగా జీవించాలని, ఎవరి దారిలో వాళ్లం వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఈ ఐదేళ్లలో మేం ఎంతో సంతోషంగా, అప్యాయంగా ఉన్నాం. కానీ.. మాలోని రాక్షసులతో పోరాడటం కూడా కష్టమే. మీరందరూ కోరుకున్నట్లే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇది చాలా కాలంగా కొనసాగుతోంది. ఇది సోషల్ మీడియాలో కనిపించినంత తేలికైనది కాదు. మేము కలిసి ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. జీవితంలో మనకు ఏది అవసరమో దాన్ని విస్మరిస్తూనే ఉన్నాం. మా మార్గాలు కూడా భిన్నమైనవి. ఒకే చోట చిక్కుకుని ఉండకుండా ముందుకు సాగాలని మేము గ్రహించాం’’ అని దీప్తి పేర్కొంది. అయితే, ఈమె పోస్ట్‌పై షన్ముఖ్ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ పోస్ట్ పెట్టడానికి కొన్ని గంటల ముందే షన్ముఖ్ ‘‘ఈ ఏడాది (2021) నిజంగానే.. అరె ఏంట్రా ఇది అన్నట్లుగా ఉంది. ‘సౌర్య’ సీరిస్.. బిగ్‌బాస్’’ అని పోస్ట్ పెట్టాడు. 






Also Read: బాలకృష్ణతో సినిమా ప్రకటించిన దర్శకుడు... స్క్రిప్ట్ రెడీ!
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Also Read: 'గాలోడు' టీజర్.. సుడిగాలి సుధీర్‌ మాస్ అవతార్..
Also Read: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
Also Read: అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.