రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్‌కు అదిరిపోయే అవకాశం దక్కింది. ఈ సిరీస్‌కు తనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అవకాశం దక్కింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.


ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకునే వరకు తనను మైదానంలోకి దించబోమని తెలిపారు. వరల్డ్ కప్‌కు తను పూర్తిగా ఫిట్‌గా ఉండాల్సి ఉందని పేర్కొన్నారు. సెలక్టర్లందరూ రోహిత్ శర్మతో మాట్లాడారన్నారు.


ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కూడా రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్‌కి గోల్డెన్ చాన్స్ దక్కింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు యువ కెరటాలు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. మొత్తంగా 18 మందిని ఈ టూర్‌కు సెలక్ట్ చేశారు.


రవిచంద్రన్ అశ్విన్‌కు చాలా కాలం తర్వాత వన్డే జట్టులో అవకాశం దక్కింది. యువ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు కూడా జట్టుకు ఎంపికయ్యారు. ఇక పేసర్ల విషయానికి వస్తే.. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసీద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లు ఈ సిరీస్‌లో ఆడనున్నారు. మహ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చారు.


దక్షిణాఫ్రితో వన్డేలకు భారత్ జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసీద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్