యాక్షన్‌ ప్రియులను విశేషంగా అలరించే జోనర్స్ లో 'స్పై యాక్షన్‌ థ్రిల్లర్స్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గూఢచారులుగా, నిఘా ఏజెంట్ లుగా, సెక్యూరిటీ కమాండోలుగా హీరోలు బిగ్ స్క్రీన్ మీద చేసే విన్యాసాలు, సాహసాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ కు స్పై జోనర్స్‌ పెద్దగా కలిసిరావడం లేదనిపిస్తోంది. ఇతర భాషల స్పై యాక్షన్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది కానీ, నేరుగా మన తెలుగులో తీసిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మారుతున్నాయి.


గతేడాది 'విక్రమ్', 'సర్దార్' వంటి తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ తెలుగులోనూ మంచి విజయాలు అందుకున్నాయి. ఇదే జోనర్ లో ఈ ఏడాది వచ్చిన 'పఠాన్', 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్‌ రెకొనింగ్‌ పార్ట్‌-1' వంటి డబ్బింగ్ సినిమాలు కూడా హిట్టయ్యాయి. అయితే అదే సమయంలో తెలుగులో మన టాలీవుడ్ హీరోలు నటించిన స్పై సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి.


కింగ్ అక్కినేని నాగార్జున రా (RAW) ఏజెంట్ గా నటించిన 'ది ఘోస్ట్' మూవీ ఫ్లాప్ అయింది. అలానే నాగ్ తనయుడు యూత్ కింగ్ అఖిల్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' కూడా నిరాశ పరిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇదే క్రమంలో ఇటీవల ‘స్పై’ సినిమాలో గూఢచారిగా నటించిన నిఖిల్ సిద్ధార్థ డిజాస్టర్ చవిచూశాడు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.


ఇప్పుడు లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మరో స్పై యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గూఢచారి పాత్రలో నటించిన ఈ సినిమా.. తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకొని, మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.  కలెక్షన్స్ చూస్తుంటే ఈ ఏడాది డిజాస్టర్ లిస్టులో చేరబోతోందని తెలుస్తోంది. 'ఘోస్ట్' దర్శకుడు ప్రవీణ్ సత్తారే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించడం గమనార్హం. 


Also Read: రచ్చ గెలిచాం, ఇంట గెలవలేమా? 


ఇలా తెలుగులో తీసిన స్పై జోనర్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కొన్నాళ్లపాటు స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ కు దూరంగా ఉంటే బెటరేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇతర భాషల సినిమాలు హిట్ అవుతున్నాయి కదా అని వాటిని ఫాలో అవకుండా, సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ను మెప్పించే సినిమాలతో రావాలని సూచిస్తున్నారు. 


అయితే టాలీవుడ్ లో ఇప్పుడప్పుడే స్పై యాక్షన్ చిత్రాలకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. అదే జోనర్ లో ప్రస్తుతం పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 'డెవిల్' అనే పీరియాడిక్ స్పై థ్రిల్లర్ రాబోతోంది. 1945లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక చీకటి రహస్యాన్ని చేధించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ - టీజర్ ఆకట్టుకున్నాయి. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా, నవంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. 


అలానే యంగ్ హీరో అడవి శేష్ కూడా ఏజెంట్ గా అలరించడానికి రెడీ అవుతున్నాడు. ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేష్.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘జీ2’ అనే సినిమా చేస్తున్నాడు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో 'వార్ 2' వంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ లో భాగం కాబోతున్నారు. మరి వీటిల్లో ఏవేవి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు నమోదు చేస్తాయో చూడాలి.


Also Read: బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ‘జైలర్‌’.. 72 ఏళ్ళ వయసులో రజినీ ర్యాంపేజ్ మామూలుగా లేదుగా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial