తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. మన చిత్రాలు భాషా ప్రాంతీయత సరిహద్దులను చెరిపేసి, పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్నాయి. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని సైతం ఆకర్షించి, హలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ క్రమంలో మన యాక్టర్స్, టెక్నిషియన్స్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. నేషనల్ అవార్డ్స్ సాధించి టాలీవుడ్ ను అగ్రస్థానంలో నిలుపుతున్నారు. అయితే రచ్చ గెలిచిన మన సినిమాలు, ఇంట మాత్రం గెలవలేకపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాదు.. కాదు.. అస్సలు ప్రోత్సాహమే లేదంటున్నారు. ఇంత ఘనత సాధిస్తున్నా.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మన తెలుగు సినిమాను ఇంకా చిన్న చూపే చూస్తున్నాయని సినీ ప్రేమికులు వాపోతున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో కూడా ఇదే భావన ఉంది.


ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'RRR' చిత్రం వందేళ్ల ఇండియన్ సినిమాకి 'ఆస్కార్ అవార్డ్' కలను సాకారం చేసిపెట్టింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ తో పాటుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ లోనూ సత్తా చాటింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పలు అంతర్జాతీయ వేదికపై మెరిశారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చిత్రం ఏకంగా 6 జాతీయ చలన చిత్ర అవార్డులు సొంతం చేసుకుంది. మరోవైపు 'పుష్ప' సినిమాకి గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. ఇటీవల ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌-K’ టీమ్ ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో సందడి చేసింది.


ఈ విధంగా మన 'తెలుగు సినిమా' జాతీయ స్థాయిలోనే కాదు, గ్లోబల్ వైడ్ గా ప్రశంసలు అందుకుంటోంది.. అవార్డులు సాధిస్తోంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగు చిత్రాలకి పురస్కారాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి సినీ కళాకారులకు రావాల్సిన ప్రోత్సాహకాలు రావడం లేదు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో తెలుగు చిత్రాలు ఏకంగా 11 అవార్డులు గెలుచుకున్న నేపథ్యంలో.. నంది అవార్డులు, ఇతర స్టేట్ అవార్డులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


Also Read:  National Film Awards: RRR సినిమా 2022 లో రిలీజైతే, 2021 అవార్డ్స్ ఎందుకు ఇచ్చారో తెలుసా..?


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 1998 నుంచి ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటిస్తూ వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పురస్కారాలు ప్రధానం చేస్తూ వచ్చింది. అయితే అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు జరగడంతో ప్రభుత్వం నంది అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో 2014, 2015, 2016 సంవత్సరాలకి గానూ నంది అవార్డులను ప్రకటించింది. ఆ సమయంలో ప్రభుత్వం పక్షపాతంతో అవార్డులను ప్రకటించిందని తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో నంది అవార్డుల కార్యక్రమాన్ని నిలిపివేసారు.


ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2019 సంవత్సరానికి నంది అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ మధ్య టాలీవుడ్ సినీ పెద్దల బృందం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించిన సందర్భంగా కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల ప్రధానోత్సవంపై హామీ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ కళాకారులకు స్టేట్ అవార్డులు ఇస్తామని పలు సందర్భాల్లో చెప్పింది. అయితే ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో అవార్డుల ప్రదానోత్సవం జరగలేదు. ‘బలగం’ వంటి మంచి సినిమాలను సైతం ప్రపంచం గుర్తించింది. కానీ, తెలుగు రాష్ట్రాలు మాత్రం అలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహించేందుకు పురస్కారాలను అందించకపోవడం బాధకరమనే అభిప్రాయం ఉంది.


ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డుల బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తనకు అప్పగించారని తెలిపారు. నిజాయితీగా వివక్షకు తావు లేకుండా ఉత్తములు, అర్హులకు మాత్రమే అవార్డులను అందిస్తామని.. ఒకేసారి డ్రామా, టీవీ, సినిమా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని.. మొదటగా పద్యనాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని వెల్లడించారు. 


ఏదేమైనా 'తెలుగు సినిమా' అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంటున్నా, స్థానికంగా మాత్రం గెలవడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు నంది అవార్డులంటే మన టాలీవుడ్‌కు ఆస్కార్‌తో సమానంగా భావించేవారని, రాష్ట్ర విభజన తర్వాత అది అటకెక్కిందని అంటున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ కళాకారులకు అవార్డులు, ప్రోత్సాహకాలు అందించాలనికోరుతున్నారు. ఇండస్ట్రీ అభివృద్ధికి సహకారం అందించినట్లే, అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే 'తెలుగు సినిమా' ఖ్యాతిని మరింత విస్తరింప చేయటానికి కృషి చేస్తారని అభిప్రాయ పడుతున్నారు.


Also Read: National Film Awards 2023: జాతీయ ఉత్తమ నటుడిగా జెండా పాతిన మొట్టమొదటి తెలుగోడు!