'రక్షణ' సినిమాను నాలుగేళ్ల క్రితం చేశానని, ఇప్పుడు తనకు వచ్చిన సక్సెస్ క్యాష్ చేసుకోవడానికి విడుదల ప్లాన్ చేశారని, తనకు ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ పూర్తిగా క్లియర్ చేయలేదని, పైగా ప్రమోషనల్ కార్యక్రమాలకు రావాలని డిమాండ్ చేశారని, రాకపోతే తెలుగు సినిమా నుంచి తనను బ్యాన్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల కాలంలో 'రక్షణ' చిత్ర బృందం వాడిన భాష, వ్యవహరించిన తీరు బాలేదని, తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆవిడ హెచ్చరించారు. ఈ వివాదంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఓ లేఖ విడుదల చేసింది.


మార్చిలో పాయల్ మీద కంప్లైంట్ వచ్చింది!
మార్చిలో 28వ తేదీన పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) మీద 'రక్షణ' దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ కంప్లైంట్ ఇచ్చారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council) ఈ రోజు పేర్కొంది. ప్రచార కార్యక్రమాలకు ఆమె సహకరించడం లేదని, పైగా నాలుగేళ్ల క్రితం సినిమా గనుక ఓటీటీలో విడుదల చేసుకోమని సలహా ఇచ్చిందని ప్రణదీప్ తెలిపినట్టు పేర్కొంది.


ఆరు లక్షల రూపాయలు మాత్రమే బ్యాలన్స్!
తన పేమెంట్ క్లియర్ చేయడం లేదని పాయల్ చేసిన ఆరోపణ మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. దర్శక నిర్మాతలతో ఆమెకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం 50 రోజులు షూటింగ్ చెయ్యాలని, అగ్రిమెంటులో 16వ క్లాజు ప్రకారం విడుదల వాయిదా పడినా సరే, ముందుకు జరిగినా సరే ఆమె చిత్రీకరణ పూర్తి చెయ్యాలని... 17వ క్లాజు ప్రకారం చిత్రీకరణ చేసిన 50 రోజులు కాకుండా ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాలకు సమయం కేటాయించాలని TFPC తెలిపింది. 


'రక్షణ'ను తొలుత ఏప్రిల్ 19న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారని, పబ్లిసిటీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే పాయల్ పారితోషికంతో బ్యాలెన్స్ రూ. 6 లక్షలు కూడా ఇవ్వడానికి దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ముందుకు వచ్చారని నిర్మాతల మండలి తెలిపింది. పాయల్ పేరు మీద ఏప్రిల్ 4వ తేదీన చెక్ రాసి తమకు ఇచ్చారని వివరించింది. పాయల్ పబ్లిసిటీ చెయ్యకపోవడం వల్ల తనకు, తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ లాస్ వచ్చిందని ప్రణదీప్ ఠాకోర్ ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొంది. 


పాయల్ ప్రమోషన్లకు రాదని మేనేజర్ చెప్పారు!
పాయల్ మీద 'రక్షణ' దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ చేసిన ఫిర్యాదును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artist Association)కు పంపించామని, అయితే తమ సంఘంలో ఆమె సభ్యురాలు కాదని 'మా' నుంచి రిప్లై వచ్చినట్టు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వివరించింది. ఆ కంప్లైంటును ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPAA)కు కూడా పంపించినట్టు తెలిపింది.


Also Readపిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ చందు


ఏప్రిల్ 4న పాయల్ మేనేజర్ సౌరభ్ ధింగ్రాకు ఫోన్ చేయగా 12న మీటింగుకు వస్తానని చెప్పారని, మళ్లీ అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి నాలుగేళ్ల క్రితం సినిమా కనుక పాయల్ ప్రమోషన్స్ చెయ్యదని చెప్పాడని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మే 18న అతడికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తే సానుకూలంగా స్పందించలేదని ప్రణదీప్ ఠాకోర్ తమకు తెలిపినట్టు తెలియజేసింది. ఇంతలో సోషల్ మీడియాలో పాయల్ చేసిన పోస్ట్ తమ దృష్టికి వచ్చిందని వివరించింది.



తప్పుదోవ పట్టించేలా సోషల్‌ మీడియా పోస్ట్ 
పాయల్ సమస్యను తప్పుదోవ పట్టించేలా, దురుద్దేశ పూర్వకంగానే పోస్ట్ చేసిందని, గత నెలన్నరగా తాము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ వృథా అయ్యాయని, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎప్పుడూ తమ దృష్టికి వచ్చిన సమస్యను ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తామని లేఖను ముగించింది.


Also Readచందు కంటే ముందు ఐదుగురితో ఎఫైర్లు - పవిత్ర జయరాం అక్రమ సంబంధాలపై శిల్ప