నేడు (ఆగస్టు 29) కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్ బన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నా సామిరంగా' అనే అవుట్‌ అండ్‌ అవుట్‌ రూరల్ మాస్‌ ఎంటర్టైనర్ ను పట్టాలెక్కించబోతున్నారు. ఇదే క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న D51 మూవీలో నాగ్ ఓ పవర్ ప్యాక్డ్ రోల్‌ లో నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 


కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. #D51 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఈ మూవీలో నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ 'పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కి పవర్‌ హౌస్ అదనంగా వచ్చి చేరింది' అంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసారు. 


''ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందే మా పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం మాకు ఒక పవర్‌ హౌస్ అవసరం అయింది. దానికి మా ఓన్ 'కింగ్' కంటే బెటర్ ఇంకెవరు ఉన్నారు. మరోసారి మీతో కలిసి పని చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మీరు ఈ సినిమాలో భాగమవుతుండం మాకు గౌరవంగా భావిస్తున్నాం. ఈ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వేచి ఉండలేకపోతున్నాం. హ్యాపీ బర్త్ డే కింగ్ అక్కినేని నాగార్జున'' అని D51 మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు. 






Also Read: HBD King Nagarjuna: 'సెల్యులాయిడ్ సైంటిస్ట్' నాగార్జున - ఈ సినిమాలే నాగ్‌ను ‘కింగ్’ చేశాయ్!


ధనుష్ 51వ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP & అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఆసియన్ సునీల్ నారంగ్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరు గతంలో నాగ్ తో 'ది ఘోస్ట్' సినిమా చేయడమే కాదు, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య - డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలయికలో 'లవ్ స్టోరీ' మూవీని రూపొందించారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి కింగ్ తో వర్క్ చేయడానికి రెడీ అయ్యారు. 


గతంలో కార్తీ వంటి తమిళ్ హీరోతో 'ఊపిరి' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు నాగార్జున. ఇప్పుడు ధనుష్ తో కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడికానున్నాయి. 


ఇకపోతే శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై 'నా సామిరంగ' సినిమా చేస్తున్నారు నాగార్జున. బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించిన ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎమ్‌.ఎమ్‌ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనివాస్‌ చిట్టూరి దీనికి నిర్మాత. ఈ సినిమాతో కింగ్ మాస్ జాతర చూడబోతున్నామని తాజాగా విడుదల చేసిన టైటిల్ టీజర్ ని బట్టి అర్థమవుతోంది. నాగ్ మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ గెటప్ లో, వింటేజ్ లుక్ లో కనిపించి సర్ప్రైజ్ చేసారు. 2024 సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇలా నాగార్జున బర్త్ డే స్పెషల్ గా రెండు అప్డేట్స్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని నమ్మకంగా ఉన్నారు.


Also Read: రామ్ చరణ్ సినిమాకు సీక్వెల్, అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial