రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘తిరగబడరా సామీ’. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్‌ నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రూపొందుతోంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘తిరగబడరా సామీ’ టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది.


హీరోయిన్‌‌కు ముద్దు పెట్టిన దర్శకుడు


ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ వేడుకలో హీరోయిన్ మన్నారా చోప్రాకు డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. చిత్రబృందం ఫొటోకు ఫోజులు ఇస్తున్న సమయంలో, అందరూ చూస్తుండగానే హీరోయిన్​కు దర్శకుడు ముద్దు పెట్టాడు. దర్శకుడు చేసిన పనికి మన్నారా షాక్ అయ్యింది. చాలా ఇబ్బంది అనిపించినా, మనసులో దాచుకుని నవ్వుతూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  






దర్శకుడి తీరుపై నెటిజన్ల ఆగ్రహం


ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఇవన్నీ కామన్ అని కొందరు అంటుంటే, దర్శకుడికి ఇదేం పోయేకాలం? అని మరికొంత మంది మండిపడుతున్నారు. హీరోయిన్ తో దర్శకులకు చనువు ఉండటం కామన్. అయినా, ఇలా మీడియా ముందు, అందరూ చూస్తుండగా ఇదేం చెత్త పని అంటూ నిప్పులు చెరుగుతున్నారు. దర్శకుడు హుందాగా వ్యహరించాలే తప్ప, చిల్లర చేష్టలు చేయకూడదంటున్నారు. గతంలోనూ తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి ఘటనే జరిగింది. నటి కాజల్ స్టేజి మీద మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఆమెకు ముద్దు పెట్టాడు. అప్పట్లో ఈ ఘటన చాలా సంచలనం సృష్టించింది.   


సినిమాపై అంచనాలు పెంచిన టీజర్


ఇక బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్‌తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ఏఎస్ రవికుమార్. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తోంది. మేకర్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందమైన ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఫన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. చలాకీ కుర్రాడు రాజ్ తరుణ్ పిరికివాడికి కనిపించడం ఆసక్తికరంగా ఉంది. అతని లవర్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది.  మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో నటించారు.  మన్నార్ చోప్రా కీలక పాత్ర పోషించింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగాయి. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.


Read Also: గౌతమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది, కొడుకు గొప్ప మనసుకు తల్లి నమ్రత ఎమోషనల్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial