హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే.. కంటెస్టెంట్‌లకు నరకం చూపించాడు బిగ్ బాస్. పడుకోడానికి పరుపులు, దిండ్లు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో అంతా నేలపైనే పడుకున్నారు. కొందరికి మాత్రమే బెడ్ దొరికింది. అంతకు ముందు.. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి నవీన్ పోలిశెట్టి వెళ్లాడు. కాసేపు హౌస్ సభ్యులతో గడిపాడు. ఈ సందర్భంగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హౌస్ మేట్స్‌కు కొన్ని టాస్క్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత హౌస్ నుంచి బయటకు వెళ్లాడు. 


కంటెస్టెంట్లు రాత్రి చాలా సేపు నిద్రపోలేదు. దీంతో టేస్టీ తేజా పలుసార్లు నిద్రపోతా బిగ్ బాస్ అని అడిగాడు. దీంతో షకీలా కలుగజేసుకుని.. ‘‘బిగ్ బాస్ నీకు ఏం మర్యాద ఇచ్చాడు. నిద్ర వస్తుందని చెప్పినా స్పందించడం లేదు’’ అని అడిగింది. దీన్ని టేస్టీ తేజా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. ‘‘నాకు నిద్ర వస్తుందని చెప్పాను కాబట్టే.. బిగ్ బాస్ లైట్లు ఆర్పేశాడు’’ అని అన్నాడు. ఆ తర్వాత షకీలా పేరుతో పాట పాడి వినిపించాడు. 


నిక్కర్లు వేసుకుని డ్యాన్స్ చేస్తే తప్పులేనప్పుడు అదెలా తప్పు?: షకీలా 


టేస్టీ తేజా.. మనసులో ఏదీ దాచుకోకుండా తన మనసులో ఉన్న సందేహాలను తీర్చేసుకున్నాడు. షకీలాను దాదాపు ఇంటర్వ్యూ చేశాడు. అసలు మీరు ఎందుకు అలాంటి సినిమాలే చేయాలని అనుకున్నారని ప్రశ్నించాడు. అయితే, ఆమె ఎలాంటి జంకులేకుండా ధైర్యంగా సమాధానాలు చెప్పింది. ‘‘నాకు అప్పట్లో ఏయే అవకాశాలు వచ్చాయో వాటిని ఒప్పుకున్నా. అప్పట్లో నాకన్నీ అడల్ట్ సినిమా ఆఫర్లే వచ్చాయి. అంతకు ముందు చిన్న చిన్న గ్లామర్ సినిమాలు చేశాను. నిక్కర్లు వేసుకుని గ్లామర్‌గా డ్యాన్సులు చేసినప్పుడు లేని తప్పు.. అలాంటి సినిమాల్లో చేయడంలో తప్పేంటి అనిపించింది’’ అని తెలిపింది. అలాంటి సినిమాలు ఎన్ని చేశారని టేస్టీ తేజా అడిగాడు.. ‘‘500 పైగా సినిమాలు చేశాను’’ అని షకీలా సమాధానం ఇచ్చింది. మరి మీ ఇంట్లో ఏమీ అనలేదా అని మరో ప్రశ్న అడిగాడు. ‘‘ఏమీ అనలేదు. డబ్బులు బాగా వచ్చేవి కదా. అయినా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావేంటీ?’’ అని షకీలా అడిగేసరికి.. టేస్టీ తేజ తన ప్రశ్నల వర్షానికి పుల్‌స్టాప్ పెట్టాడు. 


ప్రస్తుతం ఇంట్లో టేస్టీ తేజ, శోభశెట్టి, దామిని, శుభ్రశ్రీ ఉత్సాహంగా కనిపిస్తుంటే.. రతిక పుల్లలు పెట్టే పనిలో బిజీగా ఉంది. అయితే, ఆమె టాస్క్ వల్ల శోభా శెట్టి కాస్త అన్ ఈజీగా ఫీలైంది. మనకు గొడవలు అవుతాయేమోనని రతిక ముందే కన్నీళ్లు పెట్టుకుంది. సీక్రెట్ టాస్క్ పేరుతో చాలా సీరియస్‌గానే గొడవలు పెట్టే పనిలో నిమగ్నమై ఉంది. శివాజీ సైలెంట్‌గా ఉంటూనే సెటైర్లు వేస్తూ నవ్విస్తున్నాడు. ఒక్కోసారి కంటెస్టెంట్లతో ఇమడలేక ఇబ్బంది పడుతున్నాడు. షకీలా, కిరణ్ రాథోడ్ కూడా అదే స్థితిలో ఉన్నారు. 


హౌస్‌లో అంతా డమ్మీలే.. శివాజీ ఫస్ట్ నామినేషన్ ఛాన్స్


హౌస్‌లో ఇప్పుడు ఉన్న 14 మంది డమ్మీలేనని మరోసారి ‘బిగ్ బాస్’ స్పష్టం చేశాడు. ఆ తర్వాత నరకం సెట్‌లో నామినేషన్లు నిర్వహించాడు. ఫొటోలు చింపి, నరకంలోని మంటల్లో వేసి నామినేట్ చెయ్యాలని కోరాడు. ఫస్ట్ నామినేషన్ వేసే అవకాశం శివాజీకి వచ్చింది. కాని మొదటి రోజే నామినేషన్ వేయడం కష్టమని చెబుతూనే.. దామిని, గౌతంలను నామినేట్ చేస్తున్నాడు చెప్పాడు. దీంతో బిగ్ బాస్ దామిని, గౌతంలను ‘బిగ్ బాస్’ కన్ఫెషన్ హాల్‌లోకి పిలిచాడు. శివాజీ చెబుతున్న కారణాలను వారికి చూపించాడు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘‘గౌతం చాలా యంగ్ ఏజ్, యాక్టింగ్, డైరెక్టర్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి బతికేయగలడు. ఫైనాన్సియల్ పొజీషన్ బాగుంది. దామిని సింగర్.. చాలా మంచి పాటలు పాడింది. ఆమెను ఆడియన్స్ సేవ్ చేస్తారని అనుకుంటున్నా. గౌతం, దామినిలు తగిన అంత ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వలేరనేది ప్రధాన కారణం’’ అని తెలిపాడు. 


రతిక, ప్రశాంత్‌లను నామినేట్ చేసిన ప్రియాంక


నామినేషన్ వేసే రెండో అవకాశం ప్రియాంక జైన్‌కు వచ్చింది. ఆమె రైతు పల్లవి ప్రశాంత్, రతికలను ఎంచుకుంది. వారిద్దరు తనకు క్లోజ్ కాలేకపోయారని తెలిపింది. గుడ్ లక్ చార్మ్ వచ్చిన తర్వాత వారిద్దరు.. రైతు బిడ్డలం అని కలిసిపోయారని, కానీ అందరితో కూడా కలవాలి కదా అని చెప్పింది. ఆమె కారణం విని రతిక, ప్రశాంత్ ఆశ్చర్యపోయారు. ప్రియాంకను ఆ విషయం అడిగారు. దీంతో ఆమె వారికి క్షమాపణలు చెబుతూనే.. తాను చెప్పిన కారణం కరక్టేనని పేర్కొంది. 


Also Read: నాకు పెళ్లి కాలేదు, ఆ 35 లక్షలు తీసుకొని వెళ్లిపోయినా బాగుండేది - శివాజి