- నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినుల మృత్యువాత
- భయాందోళనలో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు
- గురుకులాల సమన్వయాధికారికి బాధ్యత లేదా?
విచారణ జరపాలన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్


Etcherla APSWRS: శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల బాలయోగి గురుకులానికి ఏమైంది? విద్యార్థినులు ఎందుకు మృత్యువాత పడుతున్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు చనిపోవటం చర్చనీయాంశమైంది. ఇక్కడి అధికారులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థినుల బాగోగులు అధికారులు పట్టించుకోవటం లేదా? అసలేం జరుగుతోంది? కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


కలెక్టర్ భరోసా ఇచ్చినా తొలగని భయాలు ! 
కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ గురుకులాన్ని సందర్శించి విద్యార్థినులకు ధైర్యం చెప్పారు.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కానీ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. గురుకులాల సమన్వయాధికారి.. ఇక్కడే ఉంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. విద్యార్థినుల మరణాలకు కారణాలను విశ్లేషించలేకపోతున్నారు. సమస్యలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆమె.. అంతా.. 'మేనేజ్మెంట్'కే పరిమితమైపోతున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు.


సమగ్ర విచారణ అవసరం
బాలయోగి గురుకులంలో విద్యార్థిని మృతి బాధాకరమని, ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేపడితే.. పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గురువారం గురుకులాన్ని వారు సందర్శించారు. విద్యార్థులను కలిసి, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నారు. మృతి చెందిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితులు, ఆమె సహచర విద్యార్థులతో ఎలా ఉండేవారని ఆరా తీశారు. అనంతరం పాఠశాలల జిల్లా కో ఆర్డినేటర్ యశోద లక్ష్మితో మాట్లాడారు.


విద్యార్థిని చనిపోవడంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, బంధువులు


గతంలో ఓ విద్యార్థిని మరణించిన తరువాత తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం సిడబ్లూసీ చైర్ పర్సన్ శ్రీ లక్ష్మి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి మొదలవలస వాసుదేవకుమార్ మాట్లాడుతూ ఇటీవల మరణించిన విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈమె మృతిపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఈమె తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా తమ సహకారం అందిస్తామని అన్నారు.

Also Read: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి, మృతదేహంతో నిరసన!


తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్ పెట్ మండలంలోని ఏల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందాడు. అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతు బుధవారం రోజు ప్రాణాలు విడిచాడు. విద్యార్థి ఆరోగ్యం పట్ల ఆ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఆ విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహంతోనే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.


Also Read: Chandrababu Kuppam Tour: టీడీపీ నేతలపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు