చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణంలో పర్యటన కొనసాగుతోంది. పలుచోట్ల ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు తోపులాటలు, రాళ్ల దాడులకు దారి తీసింది. రెండో రోజు చంద్రబాబు పర్యటనలో‌ భాగంగా గురువారం ఉదయం చంద్రబాబు అన్న క్యాంటీన్ ను ప్రారంభించాల్సి ఉండగా, వైసీపి నాయకులు క్యాంటీన్ ధ్వంసం చేసి బందుకు వైసిపి పిలుపు ఇవ్వడంతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు చేశారు పోలీసులు. 
వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం.. హత్యాయత్నం కేసులు
కుప్పంలో గురువారం వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రామకుప్పం మండలంలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్సీ గౌను వారి శ్రీనివాసులు సహా ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాయత్నం కేసుతో పాటుగా 143, 147, 148, 149, 424 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తంగా కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తలకు కారణం కావడంతో పాటు టీడీపీ నేతలపైన కేసులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. 
తప్పుడు కేసులు పెడుతున్నారు: టీడీపీ నేతలు
ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు తమ పైన పోలీసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. కుప్పంలో వైసీపీ, టీడీపీ నేత గొడవలతో మరో రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు పర్యటిస్తుండగా కుప్పంలో వైఎస్ఆర్ సీపీ నేతలు బంద్ కు పిలుపు ఇచ్చారు. మరోవైపు తన నియోజకవర్గం కుప్పంలో‌ పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించనున్నారు చంద్రబాబు. అంతే‌కాకుండా వైసీపీ అధికారంలోకి‌ వచ్చినప్పటి‌ నుంచి కుప్పంలో ఎదురవుతున్న సమస్యలపై చంద్రబాబు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంమై, స్థానికంగా పార్టిని మరింత బలోపేతం చేసేందుకు నాయకులకు, కార్యకర్తలను తమ సలహాలు, సూచనలు చేశారు.






చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మూడు రోజుల పర్యటన బుధవారం (ఆగస్టు 25) ప్రారంభం అయింది. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో చంద్రబాబు పర్యటించారు. గురువారం కుప్పంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. లోపలి ఫ్లెక్సీలను చింపేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టేబుళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో చిత్తూరు ఎస్పీ కూడా కుప్పం చేరుకుని సమీక్షించారు.
Also Read: Kuppam News: కుప్పంలో టీడీపీ-వైసీపీ నేతల రచ్చ! అన్నా క్యాంటిన్ ధ్వంసం - రోడ్డుపైనే ఎంపీ, ఎమ్మెల్సీ నిరసన


వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించిన చంద్రబాబు, అధైర్య పడవద్దనీ, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం కార్యకర్తల ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని, వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు.