Rains in Telangana AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుపాను వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, యానాంలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఆగస్టు 30 వరకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ కావడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావం తెలంగాణపై కొనసాగుతూనే ఉంది. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. నేడు సైతం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో మరికొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రాష్ట్రంలో గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి..





ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆగస్టు 28 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఏపీలోని రాయలసీమపై ప్రభావం చూపుతోంది. నేడు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 27, 28 తేదీల్లోనూ రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 28 వరకు రాయలసీమ ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేసి, అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.