AP Minister Roja Says Balakrishna Dialogue: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకించేవారంతా బ్లడీ ఫూల్స్ అంటూ ఫైరయ్యారు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రోజా. అలాంటి వారందరి బాక్సులు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బద్దలైపోతాయని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections) మరోసారి వారందరికీ పెద్ద గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైనా, విభజిత ఏపీ అయినా.. ఇప్పటి వరకూ తెలుగు వాళ్లని పాలించిన 15మంది ముఖ్యమంత్రుల చరిత్రల్ని తిరగరాస్తున్నది సీఎం జగన్ ఒక్కరేనని అన్నారు రోజా. 


ఆత్మకూరు ఉప ఎన్నికల (Atmakur By-elections) ప్రచారంకోసం మండలానికి ఓ మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించారు సీఎం జగన్. చేజర్ల మండలానికి రోజా ఇంఛార్జ్ మినిస్టర్ కాగా, మండలంలోని పలు గ్రామాల్లో ఆమె సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో భారీ మెజార్టీ సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జనసేన అయినా, వైఎస్సార్‌సీపీ అయినా, టీడీపీ అనే వ్యత్యాసం లేకుండా అన్ని పార్టీ నేతలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ సొంతమన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి కుటుంబాన్ని గెలిపించి, గౌతమ్ రెడ్డికి ఘన నివాళి ఇవ్వాలని స్థానిక ప్రజలకు మంత్రి రోజా పిలుపునిచ్చారు. మీరు వేసే ప్రతి ఓటు గౌతమ్ అన్న మంచితనానికి, జగనన్న సుపరిపాలనకు వేసే ఓటు అని గుర్తుంచుకోవాలన్నారు.

ఆత్మకూరు గడ్డ మేకపాటి గడ్డ, వైఎస్ జగన్ అడ్డా.. 
గౌతమ్ అన్న మరణంతో ఆత్మకూరులో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆయన లేకపోవడం తీరని లోటు అని, బాధాకరం అన్నారు. గౌతమ్ రెడ్డి అందరివాడు, శత్రువులు కూడా ప్రేమించే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈరోజు ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగారు. కనుక ఆత్మకూరు గడ్డ మేకపాటి గడ్డ, జగనన్న అడ్డా అని చాటి చెప్పే అవకాశం మీకు మరోసారి వచ్చిందంటూ స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. జగనన్నను కారు కూతలు కూసే ఆ బ్లడీ ఫూల్స్‌కు బాక్సులు బద్ధలయ్యేలా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుకు ఘన విజయం అందించాలని కోరారు.


Also Read: Tirupati Traffic Police: తిరుపతిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం - సామాన్యుడ్ని ఎగిరెగిరి కాళ్లతో తన్నుతూ అరాచకం Watch Video


Also Read: Tirumala శ్రీవారి భక్తులకు ఉపశమనం, తిరుమలలో తగ్గిన రద్దీ - దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే !