Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణ్‌లోని పలు ప్రాంతాలకు, ముంబై, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు శనివారం ప్రవేశించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రుతుపవనాల గమనం మందగించడంతో తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా ప్రవేశిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. కానీ అమరావతి వాతావరణ కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 


రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య, వాయువ్యవ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఆంధ్రప్రదేవ్ తీరం వద్ద సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు ఏపీ, తెలంగాణ సహా బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, ఉపహిమాలయాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, గంగా టిక్ పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి తదుపరి రెండు నుంచి మూడు రోజులలో రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి.


కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణకు రావడానికి మరో మూడు, నాలుగు రోజులు సమయం పట్టనుందని వాతావరణశాఖ అంచనా వేసింది.  






ఏపీలో వాతావరణం ఇలా..
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కోసం రైతన్నలు ఎదురుచూపులు మరో మూడు, నాలుగు రోజుల్లో ఫలించనున్నాయి. 


గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల వర్షాలు ఇంకా మొదలుకానందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 4 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.


తెలంగాణలో వడగాల్పులు
తెలంగాణలో నేడు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వర్షం కురుస్తుందని అంచనా వేశారు. హైదరాబాద్ లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండనుంది. కానీ మధ్యాహ్నానికి హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.