Breaking News Live: గోదావరిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 22 Feb 2022 05:55 PM
గోదావరిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య 

తూర్పు గోదావరి జిల్లా యానాం జి.ఎం.సి.బాలయోగి వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఐ.పోలవరం మండలం జి.ఎం.సి.బాలయోగి వారిధి పై నుంచి గోదావరిలో యువతి, యువకుడు దూకారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్సై బి. వెంకటేశ్వర్లు చేపల వేట బోట్ తో స్థానిక మత్స్యకారులను తీసుకుని వెళ్లే సరికి అబ్బాయి మునిగిపోయి గల్లంతయ్యాడు. యువతి పైకి తేలడంతో అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేశారు.  అయితే స్పృహలో లేని యువతిని ఒడ్డుకు చేర్చి చూసేసరికి అప్పటికే  మృతి చెందినట్లు నిర్ధారించారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. 


 

నటుడు నరేష్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నపై కేసు నమోదు

Actor Naresh: నటుడు నరేష్ పేరు చెప్పుకొని రమ్య రఘపతి అనే మహిళ డబ్బులు వసూలు చేస్తోంది. హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ లో భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. 7  ఏళ్లుగా నరేష్ , రమ్య  దూరంగా ఉంటున్నారు. రమ్య వసూళ్లతో తనకు సంబంధం లేదు అని నరేష్  అన్నారు. రమ్యపై గచ్చిబౌలి పీఎస్ లో అయిదుగురు మహిళలు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నరేష్  కుటుంబ ఆస్తులు చూపెట్టి మహిళ డబ్బులు వసూల్ చేసింది. 

గౌతమ్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనున్న సీఎం జగన్ 


మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్రలో సీఎం జగన్ పాల్గొనున్నారు. కడప విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరి వెళ్లనున్నారు సీఎం జగన్. గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం కడప విమానాశ్రయం చేరుకుని తిరిగి తాడేపల్లి వెళ్లనున్నారు. 

Krishna District: టీడీపీ, వైకాపా నేతల మధ్య ఘర్షణ, కౌన్సిలర్ కు గాయాలు

Krishna District: టీడీపీ, వైకాపా నేతల మధ్య ఘర్షణ, కౌన్సిలర్ కు గాయాలు
కృష్ణాజిల్లా ఉయ్యురులో వివాదం నెలకొంది. టీడీపీ ,వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. 10వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ పై వైసీపీ కార్యకర్త హరీష్ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ కి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంత ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం
అనంతపురం జిల్లా మడకశిర గ్రామానికి చెందిన గీత నిండు గర్భిణీ  హిందూపురం నుండి కదిరికి ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో మధ్యలో గోరంట్ల దాటిన మూడు కిలోమీటర్లు తరువాత మహిళకు తీవ్రస్థాయిలో నొప్పులు వచ్చాయి. తరువాత ఆమె బస్సు లొనే మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంట ఎవరూ లేకపోవడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ లక్ష్మీనారాయణ కండక్టర్ మారెప్ప వెంటనే స్పందించి 108 సమాచారం ఇవ్వగా గోరంట్ల వాహనం అప్పటికే మరొక కేసులో ఉన్నందువలన ఓబులదేవరచెరువు 108 రావడానికి లేట్ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఉన్నత అధికారులకు సమాచారం అందించారు.


మానవతా దృక్పథంతో ఆలోచించిన ఉన్నతాధికారులు వెంటనే ఆర్టీసీ బస్సులో దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని ఆదేశించారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ హుటాహుటిన ఆర్టీసీ బస్సులోనే ప్రసవం అయిన మహిళను కొంతమంది మహిళలు సహకారంతో గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వెంటనే ఆసుపత్రిలో చేర్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తల్లి బిడ్డను 108 వాహనంలో ఆమె సొంత గ్రామానికి పంపించారు. ఈ సందర్భంగా  ప్రజలు కండక్టర్, డ్రైవర్‌ను అభినందించారు.

Nellore: నెల్లూరులో ఇంటికి చేరిన మేకపాటి భౌతిక కాయం, నివాళి అర్పిస్తున్న అభిమానులు

హైదరాబాద్ నుంచి మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక దేహం నెల్లూరులోని ఆయన ఇంటికి చేరుకుంది. అప్పటికే ఆయన్ను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. మంత్రికి నివాళి అర్పించేందుకు వారికి అవకాశం కల్పిస్తున్నారు.

Kurnool Fire Accident: కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంగన్ వాడి, హాస్టళ్లలకు, స్కూళ్లలకు ప్రభుత్వం తరపున సరఫరా చేసే గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  గుడ్లు, టన్నుల జొన్న పిండి, పాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా... ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Madhapur Woman Death: హైటెక్ సిటీ స్టేషన్ సమీపంలో మహిళ శవం

మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ పక్కన అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేణిగుంటకు చేరిన ఎయిర్ అంబులెన్స్

ఏపీ మంత్రి మేకపాటి భౌతిక కాయం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో రేణిగుంటకు చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా నెల్లూరుకు గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. అంతకుముందు ఉదయం  బేగంపేట నుంచి బయల్దేరిన హెలికాప్టర్ రేణిగుంటకు చేరుకుంది. 

Mekapati Body Moves to Nellore Today: నేడు నెల్లూరుకు మేకపాటి భౌతిక కాయం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నేడు నెల్లూరుకు తరలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో గౌతమ్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి నేరుగా నెల్లూరులోని నివాసానికి తరలించనున్నారు. ఈ రోజు రాత్రికి అమెరికా నుండి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రానున్నారు. హెలికాప్టర్‌లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయంతో తల్లి, భార్య వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు వెళ్లారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించనున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పొడి గాలులు పెరగడం వల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. తద్వారా వాతావరణం వేడెక్కుతోంది. రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ప్రాంతాలల్లో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు.


ఏపీలో దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం వెచ్చగా ఉంటుంది. వర్ష సూచన లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతాయిని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అత్యల్పంగా బాపట్లలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జంగమేశ్వరపురంలో 19.2 డిగ్రీలు, నందిగామలో 20.4 డిగ్రీలు, కళింగపట్నంలో 19.6 డిగ్రీలు, అమరావతిలో 19.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 23.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


రాయలసీమ​, తెలంగాణ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా మారింది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని బార్డర్ ప్రాంత్రాల్లో మాత్రం వేడిగా ఉంటుంది. నందిగామ​, మాచెర్ల​, ద్వారకా తిరుమలలో మాత్రం ఇలాంటి పరిస్ధితి ఉంటుంది. విజయవాడలో కూడ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరే అవకాశాలు భాగా కనిపిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ సైతం భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 18.7 డిగ్రీలు, నంద్యాలలో 19.6 డిగ్రీలు, తిరుపతిలో 19.5 డిగ్రీలు, కర్నూలులో 21.2 డిగ్రీలు, కడపలో 22.6 డిగ్రీల మేర రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


తెలంగాణ లో పెరుగుతున్న చలి.. 
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. కొన్ని చోట్ల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఉదయం వేళ చలి గాలులతో ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 10 డిగ్రీలు, నిర్మల్ లో 12.3 డిగ్రీలు, సంగారెడ్డిలో 13.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.5 డిగ్రీలు, రంగారెడ్డిలో 13.8 డిగ్రీలు, జగిత్యాలలో 14.3 డిగ్రీలు, మెదక్‌లో 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. గ్రాముకు రూ.9 చొప్పున తగ్గింది. వెండి ధర నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,050 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు స్థిరంగా రూ.70,000 వద్ద ఉంది. నేడు కూడా అదే ధర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,050గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.