Breaking News Live: భద్రాచలం విధుల నిర్వహణకు వెళ్లిన పోలీసులకు కరోనా పాజిటివ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Jan 2022 07:52 PM
భద్రాచలం విధుల నిర్వహణకు వెళ్లిన పోలీసులకు కరోనా పాజిటివ్

జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి కరోనా సోకింది. వీరందరూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భద్రాచలం విధుల నిర్వహణకు వెళ్లారు. వీరితో పాటు పనిచేస్తున్న పోలీసులు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

విద్యా సంస్థల సెలవులు పొడిగించేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ

గుంటూరు.. విద్యాసంస్థల‌ సెలవుల పొడిగింపుపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సెలవుల పెంచే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణాలో సెలవులు ఈ నెల 30 వరకు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి, ప్రకటన విడుదల

వరంగల్: రాష్ట్రంలోని పలు చోట్ల, వరంగల్ ఉమ్మడి జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో కురుస్తున్న అకాల వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితులను సమీక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 


అనుకోని విధంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. ఇప్పటికే ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. అలాగే, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేసి, అవసరమైతే రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలన్నారు. ప్రజలు ప్రస్తుత వాతావరణానికి తగ్గట్లుగా వ్యవహరించాలని కోరారు. పెద్దలు, పిల్లలను బయటకు రానివ్వవద్దని సూచించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

గాలిపటం దారం తగిలి యువకుడి కోసుకున్న యువకుడి మెడకు గాయాలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పతంగీ మాంజాతో యువకుడి గొంతుకు తీవ్రగాయాలయ్యాయి. ఇస్లాంపురకు చెందిన మొహమ్మద్ ఏజాజ్ అనే యువకుడికి అంబేడ్కర్ చౌరస్తాలో ఫ్యాన్ రిపేరింగ్ షాపు ఉంది. భోజనానికి వెళ్లి బైక్ పై షాపుకు వస్తుండగ షేక్ చాంద్ హోటల్ వద్ద ఘటన గాలి పటం దారం తగిలింది. మెయిన్ రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు పతంగి మంజ తట్టుకుని ఉండి గాలికి ఎగురుతుంటుండగ మొహమ్మద్ ఏజాజ్ పక్కనుంచి వెళ్లినప్పుడు.. అది మెడకు తగిలి మెడకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు గమనించి ఏజాజ్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ ల సలహా మేరకు నిజామబాద్ ఆస్పత్రికి తరలించి సర్జరీ చేయించారు.

భారత్‌ను ఆరోగ్య దర్శినిగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీ సొంతం.. సోము వీర్రాజు

ప్రపంచానికి రెండు కోవిడ్ వ్యాక్సిన్ లు అందించిన దేశం భారత్ అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రపంచానికి భారత్‌ను ఆరోగ్య దర్శినిగా నిలబెట్టిన మహనీయుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. కోవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ అగ్రరాజ్యాలలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చామని, 18 ఏళ్లకు పై జనాభాలో 70 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ లు కేంద్ర ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. బూస్టర్ డోస్ ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని.. అయినా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ల పంపకం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

రాజేంద్ర నగర్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్తా సిటీ అపార్ట్ మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్దమైంది. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళ సై తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా ముప్పు తప్పి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించానని... ప్రజలందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని తమిళ సై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియ్యజేశారు.


 

సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంట‌ల‌కు ఈ క్లబ్‌లో మంటలు రాజుకున్నాయి. వెంటనే మంటలు క్లబ్ మొత్తం వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. 10 అగ్నిమాప‌క యంత్రాలను మోహరింపజేసి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్యాంక‌ర్ల ద్వారా నీటిని తెప్పించి మంట‌ల‌ను అదుపు చేశారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు సుమారు 4 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. క్లబ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల సుమారు రూ.20 కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం. అగ్ని ప్రమాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


1878లో బ్రిటీష్ పాలకుల హ‌యాంలో మిలిట‌రీ అధికారుల కోసం సికింద్రాబాద్ క్లబ్‌ను నిర్మించారు. దాదాపు 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ క్లబ్ ఉంది. సికింద్రాబాద్ క్లబ్‌లో 300 మంది ప‌ని చేస్తున్నారు. ఈ క్లబ్‌లో 5 వేల మందికి పైగా స‌భ్యత్వం ఉంది.

Background

కొనసాగుతున్న కోడి పందాలు
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కోడి పందాలు, గుండాట, పేకాట జోరుగా కొనసాగుతున్నాయి. నిన్న వర్షాభావం కారణంగా సాదాసీదాగా నడచిన కోడి పందాలు, ఈ రోజు కాస్త ఎండ రావడంతో ఆశాజనకంగా సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొన్ని చోట్ల పోలీసులు కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వచ్చే సమయానికి ఆ ఒక్క రోజు ఎంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందో దాని కంటే ఎక్కువ నగదు ఒక్క పూటలో చేతులు మారింది. కోడిపందాల స్థావరాల వద్ద  మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. కొందరు మాత్రం పశ్చిమగోదావరి జిల్లాలో అసలుసిసలైన సంక్రాంతి శోభ కోడిపందాలతో కనిపిస్తోందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒకవైపు  విజృంభిస్తున్న ఒమిక్రాన్, అటు కోడి పందాలు, ఇటు పండుగ వేళ.. రాబోయే రోజులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది.


వాతావరణం
ఏపీలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద సగటుమట్టానికి 1.5 కిలో మీటర్లు ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు అదే ప్రాంతంలో తక్కువగా గుర్తించారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాక, మెరుపులు, ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


తెలంగాణలో ఇలా..
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల పెద్ద వర్షాలు, మరికొన్ని చోట్ల వడగండ్లు కూడా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. జనవరి 16న నుంచి రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ నెల 19వ తేదీ వరకూ వాతావరణం పొడిగానే ఉంటున్నట్లుగా హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అదికారులు అంచనా వేశారు.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. కానీ, వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలోకు రూ.400 వరకూ తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.400 తగ్గి రూ.65,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.