Warangal: బహుజన తొలి రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సామాన్యుడిగా జన్మించి ఆధిపత్య కులాల అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు పాపన్న. పాపన్న తెలంగాణలో అనేక కోటలను నిర్మించి ఢిల్లీ సుల్తానులను, మొగలులను ఎదిరించారు. ఎంత పోరాడినా చివరకు మొగలుల సైన్యానికి సర్వాయి పాపన్న తలదించక తప్పలేదు. 17వ శతాబ్దానికి చెందిన బహుజన రాజుగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన పాపన్న జయంతి సందర్భంగా.


సాధారణ కుటుంబంలో పుట్టి రాజుగా..


సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ పేరు వింటేనే ఢిల్లీ సుల్తానులకు, మొఘలులకు చెమటలు పట్టేలా చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలుకా ఖిలషాపూర్‌లో 1650 ఆగస్టు 18 న జన్మించిన సర్వాయి పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆయన తల్లి సర్వమ్మ పెంచింది. చిన్ననాటి నుంచే ధిక్కార స్వరాన్ని కల్గిన పాపన్న గ్రామాల్లో ప్రజలను పీడిస్తున్న కులవ్యవస్థ, భూస్వాములపై దాడులు చేయడం ప్రారంభించాడు. స్నేహితులైన చాకలి సర్వన్న, మంగళి మసన్న, దూదేకుల పీర్ హుస్సేన్, కుమ్మరి గోవింద్, జక్కుల గోవింద్, మీర్ సాహెబ్ సహా మరికొంత మంది స్నేహితులతో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలంగాణలోని భూస్వాముల ఘడీలపై దాడులు చేసి సంపదను దోచుకువెళ్ళాడు పాపన్న. ఆ సంపదతో ఖిలాషాపూర్‌లో నిర్మించిన కోటను రాజధానిగా ఏర్పాటు చేసుకుని అనేక కోటలను నిర్మించారు.


పటిష్టమైన కోటల నిర్మాణం. 
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా రెండు కోటలను ఏర్పాటు చేశారు సర్దార్ సర్వాయి పాపన్న. ఖిలాషాపూర్‌లో నిర్మించిన కోటను రాజధానిగా ఏర్పాటు చేసుకొని జిల్లాలోని తాటికొండలో పటిష్టమైన కోటలను నిర్మించారు. పాపన్న నిర్మించిన కోటలన్ని ఎత్తైన కొండలు, కొండకు ఒకే మార్గం ఉన్న వాటిని ఎంచుకొని కోటలను ఏర్పాటు చేశాడు. అందులో ఒకటి తాటికొండ ఖిలా కోట. సుమారు మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 13 అడుగుల వెడల్పైన కోట గోడలను నిర్మించి శత్రువులను ఎదిరించాడు. తాటికొండ కోటపై మూడు అంచెల సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. గుట్ట కింది భాగంలో రాతితో ఎత్తైన గోడలను నిర్మించి వాటిపై మట్టి గోడను నిర్మించిన ఆనవాళ్లు తాటికొండ కోట పటిష్ట వ్యవస్థకు నిదర్శనంగా నేటికి కనిపిస్తున్నాయి. 




చీమ చిటుక్కుమన్న తెలిసేవిదంగా తాటికొండ కోటను నిర్మించాడు. కొండపై పాపన్న ఉండడానికి విశాలమైన భవనాలను నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పాపన్న శివ భక్తుడు కావడంతో గుడిని సైతం నిర్మించాడు. నీటి అవసరాల కోసం మూడు అంచెల సెక్యురిటీ వ్యవస్థలో ఏడు కోనేరుల ఆనవాళ్లు ఇప్పటికి సజీవసాక్షిగా ఉన్నాయి. 




సర్దార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోటల్లో ప్రధానమైన కోట తాటికొండ కోటగా చరిత్రకారులు చెబుతున్నారు. పాపన్న తన సామ్రాజ్య రాజధాని ఖిలాషాపూర్ నుంచి తాటికొండ కోటకు నిత్యం అటు ఇటు తిరిగేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా తాటికొండ కోట నుంచి కిలా షాపూర్‌కు సొరంగ మార్గం నేటికీ కనిపిస్తుంది. 




బురుజు మధ్యలో పెద్ద బావి సైతం ఇప్పటికీ ఉంది. కోటపైన ఏడు కోనేరులలో నీరు అందుబాటులో లేనప్పుడు ఈ భావి నుంచి కొండపైకి వాటర్ తీసుకువెళ్లేవారని తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖిలా షాపూర్, తాటికొండ తోపాటు సర్వాయిపేటలో పాపన్న కోటలను నిర్మించారు. ఇటు తాటికొండ, అటు ఖిలా షాపూర్ కోటలు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తులు చెప్పారు. పాపన్న ఇక్కడే ఉండేవాడని ఇక్కడి నుంచి ఖీలా షాపూర్ వరకు సొరంగం మార్గం ద్వారా వెళ్లేవారని గ్రామస్తులు చెప్పారు. 


స్నేహితులతో ప్రారంభమై 12 వేల సైన్యం.
పాపన్న తన స్నేహితులతో ప్రారంభించిన సైన్యం 12 వేల సైన్యాన్ని తయారు చేశాడు. పాపన్న గెరిల్లా దాడుల్లో దిట్ట. తాటికొండలో సైనికులకు గెరిల్లా దాడులకు శిక్షణ ఇచ్చేవాడట. పాపన్న సైన్యం మొత్తం గెరిల్లా దాడులకు పాల్పడేది. ఎలాంటి మందుగుండు సామాగ్రిని ఉపయోగించలేదు కొన్ని కోటల వద్ద ఫిరంగులను మాత్రమే ఉపయోగించారు. తన 12 వేల సైన్యంతో గోల్కొండ, భువనగిరి, వరంగల్ కోటలను స్వాధీన పరుచుకున్న ఏకైక బహుజన రాజుగా చరిత్రకెక్కాడు. 1708లో కాకతీయ కోటపై 3వేల సైన్యంతో దాడి చేసి భారీ సొత్తును దోచుకొని డచ్ వారి వద్ద ఆయుధాలను, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేసినట్లు ప్రచారంలో ఉంది. 


సర్వాయి పాపన్న గోల్కొండను చేజార్చుకున్న తర్వాత తాటికొండ కోటలో పాపన్న చాలాకాలం గడిపారని ఆ సమయంలోనే మొగలు తాటికొండ కోటపై దండెత్తడంతో బీకర పోరు జరిగింది. 1687 నుంచి 1724 వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించిన పాపన్న గౌడ్ చివరకు తాటికొండలో మొగులులకు తలవంచక తప్పలేదు. 




మొగలుల సైన్యాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాడని చరిత్ర చెబుతుంది. ఒక సామాన్య వ్యక్తి నుంచి ఢిల్లీ సుల్తాన్‌లను, మొగలులను గడగడలాడించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చరిత్రకారుడు అరవింద్ అన్నారు. పాపన్న గౌడ్ కోటల్లో ఖిలా షాపూర్ తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది తాటికొండ కోట అని ఆయన చెప్పారు.


ఛత్రపతి సమకాలికుడిగా గుర్తింపు
పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లిం పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాటం చేసాడో, పాపన్న తెలంగాణాలో ముస్లిం పాలన అంతానికి పోరాడారు. 1724 వరకు మొగల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. పాపన్న ఎంతకాలం రాజుగా కొనసాగాడు అన్న అంశాన్ని పక్కన పెడితే సాధారణ వ్యక్తి నుంచి రాజుగా ఎదిగి అనేక కోటలను స్వాధీనం చేసుకున్న వ్యక్తిగా బహుజన రాజుగా చరిత్ర పుటల్లో నిలిచారు. 




మొఘల్ నుంచి తప్పించుకున్న పాపన్న చాలాకాలం కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ ప్రాంతంలో గడిపారని జానపదుల ఆధారంగా చరిత్రకారులు చెబుతారు. పాపన్నను గుర్తించి బందీగా తీసుకువెళ్ళి గోల్కొండ కోటకు వేలాడ తీసినట్లు చరిత్ర చెబుతున్నది.


Also Read: ముగ్గురు మగాళ్లకు పుట్టిన అన్నదమ్ములే వాలి సుగ్రీవులు అని మీకు తెలుసా?


Also Read: వరంగ‌ల్‌లో మరో ఉద్యమం! మరింత తీవ్ర స్థాయికి చేరిన డిమాండ్‌లు