Breaking News Live: మాచవరం పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 03 Mar 2022 10:30 PM
మాచవరం పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం 

విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. శానిటైజర్ మౌత్ వాష్ కలిపి తాగినట్టుగా జీజీహెచ్ డాక్టర్లు తెలిపారు. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి‌ ఉంది. ఆమెకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు. రైటర్ కాళిప్రసాద్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మహిళా కానిస్టేబుల్ సోదరుడు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ స్పృహలోకి రావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. 

 రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన రెండో దఫా చర్చలు 

రష్యా - ఉక్రెయిన్  మధ్య రెండో విడత చర్చలు జరుగుతున్నాయి. బెలారస్ లో ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి భేటీ అయ్యారు. గతంలో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రష్యా బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుంది. నాటోలో చేరబోమని రాతపూర్వక హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తుంది.  





రేపు పోలవరంలో పర్యటించనున్న సీఎం జగన్ 

శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పోలవరం, పునరావాస కాలనీలలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, గం.10 లకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత గం.11.20లకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి గం.12.30లకు పోలవరం డ్యామ్‌ సైట్‌ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. తర్వాత జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ పరిశీలిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసం చేరుకుంటారు. 

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా 

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

విశాఖలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖలోని  పోతిన మల్లయ్య పాలెం శివశక్తి నగర్‌లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సురేష్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న  పీఎం పాలెం పోలీసులు సురేష్  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేష్ ఆత్మహత్యకు పాల్పడే ముందు తన భార్యతో వీడియోకాల్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Visakhapatnam: విశాఖలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖలోని పోతిన మల్లయ్య పాలెం శివశక్తి నగర్‌లో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పీఎం పాలెం పోలీసులు సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సురేష్ ఆత్మహత్యకు పాల్పడే ముందు తన భార్యతో వీడియోకాల్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

AP High Court Verdict: హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే, అప్పీల్‌కు వెళ్లొద్దు: యనమల

ఏపీ 3 రాజధానుల పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామక్రిష్ణుడు స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అమరావతిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని, మళ్లీ అప్పీలుకు వెళ్లి సమయం వేస్ట్ చేయొద్దని సూచించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి జగన్‌ తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కొత్త బిల్లు తీసుకొస్తామనడం విచిత్రంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏం చేయాలన్నా రాష్ట్రపతి, కేంద్రం అనుమతి కావాలని యనమల వివరించారు.

బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా: తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడి

‘‘బంగాళాఖాతంలోని నిన్నటి అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది నాగపట్నాయనికి దక్షిణ ఆగ్నేయంగా 760 కి.మీ. దూరంలో ఉంది. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రభావం ఉంటుంది. అక్కడ మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 5 నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 5,6 తేదీల్లో 45-55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుంది. ఈ రెండు తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’’ అని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ప్రకటించారు.

Tirupati: డాక్టర్ల బదిలీలపై తిరుపతిలో నిరసన

రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ 128,40,41 లను వెంటనే రద్దు చేసి  ప్రభుత్వ వైద్యుల మూకుమ్మడి బదిలీలను ఆపాలని తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల వైద్యులు డిమాండ్ చేశారు. రుయా ఆసుపత్రి ఎదుట వైద్యులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన 30 శాతం ప్రభుత్వ వైద్యుల బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల జేఏసీ వైద్యులు రుయా ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించినందుకు ప్రభుత్వం తమకి బదిలీలు బహుమతిగా ఇవ్వడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల రుయా ఆసుపత్రి అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తున్న తరుణంలో బదిలీల పేరుతో వైద్యులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం పునరాలోచించి జీవో నెంబర్ 128, 40, 41 రద్దు చేసి బదిలీలను ఆపాలని కోరారు.

ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్! 3 రాజధానులపై ఏపీ హైకోర్టు తుది తీర్పు వెల్లడి

ఏపీలో 3 రాజధానుల అంశంపై గురువారం (మార్చి 3) ఏపీ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదేశించింది. దాని ప్రకారం రాజధాని రైతులకు 3 నెలల్లో ప్లాట్లు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వానికి శాసనాధికారం లేదని స్పష్టం చేసింది. ఆరు నెలల్లో రాజధాని ప్లానింగ్ పూర్తి చేయాలని ఆదేశించింది.

Harish Rao: శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

బాసరలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, వేణుగోపాలచారి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘అడవుల పునరుద్ధరణ కార్యక్రమమం జరగడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. 7.7 శాతం అడవుల పునరుద్ధరణ జరిగింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డికి ఆ ఘనత దక్కుతుంది. బాసర జంక్షన్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం. పరిపాలన, యుద్ధ నైపుణ్యంలో అన్నింటా శివాజీ ఆదర్శం. మత సామర్యాన్ని చాటారు. ప్రజలే ప్రభువులుగా పాలించారు. శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదు.. పవిత్ర స్థలాలు ధ్వంసం చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడంలో శివాజీ స్ఫూర్తి.’’ అని హరీశ్ రావు అన్నారు.

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


కానీ, మార్చి 4న మాత్రం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని వెల్లడించారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని ప్రకటించారు. మార్చి 5వ తేదీన కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని వెల్లడించారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.


‘‘బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారుతోంది. ఇది మెల్లగా ఉత్తర తమిళనడు వైపుగా కదలనుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం దీని ప్రభావం మన రాష్ట్రంలో మార్చి 4 అర్ధరాత్రి నుంచి మెల్లగా మొదలవ్వనుంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో మార్చి నాలుగు నుంచి అంతగా వర్షాలు ఉండవు. కానీ కొంచెం గాలులు, కొన్ని వర్షాలు, మేఘావృతమైన ఆకాశం తప్పకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో ఏర్పడే ఎటువంటి అల్పపీడనాలు అయినా తక్కువగా అంచనా వేయొచ్చు. వీటి వల్ల వరదలు రావు. మన రాష్ట్రంలోని తమిళనాడు పరిశర ప్రాంతాల్లో కొంచం ఎక్కువ ప్రభావం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు. రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింతగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా, ఎండగా ఉండే ఆకాశం ఉంటుంది. ఉదయం సమయంలో అక్కడక్కడా పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 33.6 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉంది. వచ్చే 24 గంటల్లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నేడు విపరీతంగా పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా పరిణామంతో కొద్ది రోజులుగా బంగారం ధరల్లో భారీ ఎత్తున హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నేడు గ్రాముకు ఏకంగా రూ.100 చొప్పున పెరిగింది. వెండి ధర కూడా గ్రాముకు రూ.2.10 పైసలు పెరిగి కిలోకు రూ.2100 మార్పు కనిపించింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,040 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.72,100 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,040గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,100 వేలుగా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.