20 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి పునాది పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భవనానికి గురువారం భూమి పూజ చేశారు. మధ్యాహ్నం 1.48 నిమిషాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఢిల్లీలో పార్టీ భవనం నిర్మాణం కావడం ఓ మైలురాయిగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణం కోసం పార్టీ చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం ఈ స్థలం కేటాయించింది. గతేడాది అక్టోబరు 9న వసంత విహార్ ప్రాంతంలో టీఆర్ఎస్‌కు వెయ్యి చదరపు గజాలకు పైగా భూమిని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నవంబరు 4న టీఆర్ఎస్‌కు కేంద్రం అప్పగించింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా అప్పటి నుంచి టీఆర్ఎస్ వర్గాలు వేచి చూశాయి. అప్పటి నుంచి మంచి ముహూర్తం కోసం వేచి చూసి ఇవాళ భూమి పూజ చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 


Also Read: Komatireddy Venkat Reddy: టీఆర్ఎస్ నేత పాడె మోసిన ఎంపీ కోమటి రెడ్డి.. అంత్యక్రియలకు హాజరు


తెలంగాణ సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించే బాహ్య ఆకృతితో ఏడాదిలోగా పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేసేలా పార్టీ భావిస్తోంది. నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో పార్టీ ఆఫీసును కీలక మైలురాయిగా భావిస్తోంది. ఇది భవిష్యత్తు రాజకీయాలకు నాందిగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జీ+త్రీ రీతిలో భ‌వ‌నాన్ని క‌ట్టనున్నారు. 


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా టీఆర్ఎస్ పార్టీ జెండా పండగను శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గ్రామాలు, పట్టణాల్లో వివిధ నాయకులు పార్టీ జెండా ఎగరవేశారు. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. జెండా పండగ, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జెండా పండగ పూర్తి కాగానే.. గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం మొదలు కానుంది. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 51 శాతం ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.


Also Read: YS Sharmila: నాన్నా.. ఒంటరిదాన్నయ్యా, కన్నీరు ఆగనంటుంది.. వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్


Also Read: Huzurabad News: సీఎం పదవికి హరీశ్ రావు ఎసరు.. నా సవాల్‌ స్వీకరించు హరీశ్ రావు.. ఈటల సంచలనం