Telangana CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. రాష్ట్రంలోని దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణానికి మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పునాదిరాయి వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని కొందుర్గులో ఏర్పాటు చేయనున్న బడి భవనాలకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా షాద్నగర్,మధిర, కొడంగల్, ఖమ్మం, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరిగాయి.
షాద్నగర్లో సీఎం
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ రూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు.
నల్లగొండలో కోమటిరెడ్డి
నల్లగొండలోని గందంవారి గూడెంలో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఅర్పై విమర్శలు చేశారు. కేసీర్ ఫామ్హౌస్లో పడుకుంటే కేటీఆర్, హరీష్రావు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదని కేవలం ఈ కాలంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. తాము మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని, ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు. కోమటిరెడ్డి.
ఖమ్మంలో పొంగులేటి
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూమి పూజ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి వివరించారు. చిత్తశుద్ధితో పేదల అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని అందుకే ఇలాంటి పాఠశాలలు 28 ఏర్పాటు చేస్తున్ట్టు చెప్పారు. మౌలిక సదుపాయలు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పథకం కింద రూ.657 కోట్లు కేటాయించినట్టు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కూళ్లు పెట్టి వసతులు కల్పించలేదన్నారు. ఇప్పుడు తాము మాత్రం రూ.125 నుంచి రూ.150 కోట్లతో అద్భుతమైన నిర్మాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
మధిరలో డిప్యూటీ సీఎం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో ఏర్పాటు చేయబోయే స్కూల్కు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం మల్ల భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందన్నారు. వాటిని సరిచేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రజల్లో ఐక్యతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక్కడ ప్రపంచ స్థాయి బోధన అందిస్తామన్నారు. మొదటి దశలో 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ దశల వారీగా మిగతా నియోజకవర్గాల్లో కూడా కట్టిస్తామన్నారు.
మంథనిలో శ్రీధర్ బాబు
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలో అడవి సోమన్ పల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యతోపాటు మిగతా రంగాల అభివృద్ధి కోసం తాము సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. ఓవైపు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. పదేళ్ల పాటు అప్పులు పెరిగాయే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు.
Also Read: ఐజీఎస్టీ స్కామ్లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్ సోమేష్కు మరిన్ని చిక్కులు