కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. చేనేత, జౌళి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయెల్‌లకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఇదే అంశంపై మంత్రి గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. 


Also Read: మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ తీసుకురండి.. బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్


కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం నిధులు


వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి  రూ 897.92 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. దీంతోపాటు ప్రాజెక్టుకు అనుమతి త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొ్న్నారు. కాకతీయ మెగా పార్క్ వంటి భారీ ప్రాజెక్ట్‌లు సముచితంగా లబ్ది పొందేందుకు వీలుగా 'టెక్స్‌టైల్ అపెరల్ సెక్టార్ తయారీ ప్రాంతాల అభివృద్ధి (MRTA)' విధానాన్ని ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో 1200 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ అయిన  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ‘ఫైబర్ టు ఫ్యాషన్’ కాన్సెప్ట్ ఆధారంగా, అత్యాధునిక  సౌకర్యాలతో  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నట్టు కేటీఆర్ చెప్పారు.


సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ 


 సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని, ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ 993.65 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం  రూ. 49.84 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు.  సిరిసిల్లలోని టెక్స్‌టైల్ పార్క్, చేనేత, అపెరల్ పార్క్ ల నిర్వహణ, ఆధునీకరణ ఉత్పత్తి స్థావరాన్ని విస్తరించడం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధికి కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని లేఖలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఉపాధి అవకాశాలు పెంపొందిపచేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లలో వర్కర్ టు ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్, అపెరల్ పార్క్, వీవింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.  సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేసేందుకు పార్క్‌లో సీఎఫ్‌సీని పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొత్తం వ్యయంలో తెలంగాణ ప్రభుత్వ వాటా మొత్తం  రూ.756.97 కోట్లని మంత్రి స్పష్టం చేశారు


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 


తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (I.I.H.T)ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో వెంకటగిరిలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో భాగమైందన్నారు.  ప్రస్తుతం తెలంగాణలో హండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులను అందించే సంస్థ ఏదీ లేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించడానికి కావాల్సిన వసతులన్ని ఉన్నాయని, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని హ్యాండ్‌లూమ్ పార్క్‌లో భవన సదుపాయంతో  పాటు తగినంత స్థలం కూడా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.


Also Read: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య, ఆమె తెలివికి శభాష్ అంటున్న స్థానికులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి